ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం ఎలాంటిదైనా సరే తనకూ ప్రాదాన్యత ఉండాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్సీ పదవినే అనూహ్యంగా దక్కించుకున్న ఆమె ఇప్పుడు కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ కోసం ప్రకటించిన కమిటీల్లో చోటు లేకపోవడంపై అసంతృప్తి ఫీలయ్యారు. అయితే చాన్స్ ఉంచుకోవాలనుకుంటున్నారు., అందుకే ఈ కమిటీల్లో చోటు లేదంటే.. మరో కమిటీల్లో చోటు కల్పిస్తారని చెప్పుకొచ్చారు. అంటే ఈ సారి ప్రకటించబోయే కమిటీల్లో తనకు చోటు ఉండాల్సిందేనని ఆమె సంకేతం పంపారన్నమాట.
ఇప్పటికే మంత్రి పదవి కోసం కూడా ఆమె ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవే జాక్ పాట్ అనుకుంటే.. వెంటనే ఆమె కేబినెట్ బెర్త్ పై కన్నేశారు. కానీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఆశావహులుగా ఉండటంతో ఎమ్మెల్సీలకు చాన్స్ దక్కడం కష్టమే. అందుకే ఆమె పేరు మంత్రి పదవుల ప్రాబబుల్స్ లో కనిపించడం లేదు. అయితే ఎమ్మెల్సీ ప్రాబబుల్స్ లోనూ ఆమె పేరు లేదు. అలా ఢిల్లీ వెళ్లి ఇలా తన పేరు లిస్టులో వచ్చేలా చేసుకున్నారు.
అయితే మంత్రి పదవి కష్టమే కాబట్టి.. ఈ సారి పార్టీ పరమైన కీలక పదవిని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అసలు పార్టీ కోసం ఆమె ఎప్పుడు పని చేశారో కాంగ్రెస్ నేతలకూ అర్థం కావడంలేదు. మహా అయితే ఓ ట్వీట్ పెడతారు.. ఏఐసీసీ స్థాయి నాయకులు వస్తే.. వచ్చి ప్రత్యేకగా ఆహ్వానిస్తే తప్ప పార్టీ కార్యక్రమాలకు హాజరు కారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఎప్పుడూ కనిపించరు. కానీ ఆమె పదవుల విషయంలో మాత్రం ముందు ఉంటున్నారు.