అసాంఘిక శక్తులకు అండగా ఉంటానన్న సందేశాన్ని ఏ రాజకీయ నాయకుడు అయినా పంపిస్తే ప్రజలు అలాంటి వాళ్లను చూసి భయపడతారు. అయితే ఇలాంటి భయం ఉంటేనే ప్రజల్ని బెదిరించి ఓట్లు వేయించుకోవచ్చని అనుకుంటున్నారేమో కానీ జగన్ రెడ్డి తన పంథాను పూర్తిగా అసాంఘిక శక్తులకు మద్దతుగా బహిరంగంగా మార్చుకుంటున్నారు.
ఇటీవల తెనాలిలో పోలీసులు ముగ్గురు రౌడి షీటర్లను బహిరంగంగా కొట్టారు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. గంజాయికి బానిసలై, ప్రజాభద్రతకు ముప్పుగా మారిన ఆ ముగ్గురు.. పోలీస్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం కూడా చేశారు. పోలీసులపైనే దాడి చేస్తే.. ఇక సామాన్య ప్రజల సంగతేమిటో చెప్పాల్సిన పని లేదు. అందుకే పోలీసులు తమ డిపార్టుమెంట్ పరువు అయినా కాపాడుకోవాలని వారికి బహిరంగ ట్రీట్ మెంట్ ఇచ్చారు. తెనాలిలో వారి నిర్వాకాలు తెలిసిన ప్రతి ఒక్కరూ వాళ్లకు అలా అవ్వాల్సిందే అనుకున్నారు. వాళ్లకు అలా చేయాల్సిందేనని ఎక్కువ మంది నెటిజన్లు స్పందించారు.
అయితే జగన్ రెడ్డికి మాత్రం ఆ బాధితులకు సంబంధించి జాన్ విక్టర్ అనే పేరు కనిపించింది. ఇదేదో మనోడే కదా అని ఆయన అనుకున్నారు. కుల రాజకీయాలు చేయడానికి సరిగ్గా సరిపోతుదంని అనుకుని తెనాలి బయలుదేరుతున్నారు. మంగళవారం అలా.. తెనాలి వెళ్లి ఆ రౌడి షీటర్ ను పరామర్శించి వస్తారు. అయితే శవం లేకుండా వెళ్లడం ఎలా అని వైసీపీ నేతలు కూడా మథనపడ్డారు. అందుకే ఎవడో ఓ బంగారం చోరీ కేసులో నిందితుడు అయిన మహారాష్ట్ర వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. పోలీసు వేధింపులకే చనపిోయాడని సాక్షిలో ప్రచారం ప్రారంభించారు. కానీ ఆ శవాన్ని బంధువులు మహారాష్ట్ర తీసుకెళ్లిపోయారని సమాచారం రావడంతో.. రౌడీ జాన్ విక్టర్ ను పరామర్శించడంతోనే జగన్ సరిపెట్టుకోనున్నారు.