ఉత్తరప్రదేశ్లో నేరగాళ్లకు, వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు ఆపేశారు. ఇక్కడ కూడా అలాంటివి ఆపేస్తే నేరగాళ్లకు భయం ఉంటుంది… అని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో ఏపీ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. జగన్ రెడ్డి నేరస్తుల ముఠాలను తయారు చేస్తున్నారని, వారికి అండగా ఉంటానని సంకేతం పంపేందుకే తెనాలి వెళ్లారని ఆర్కే విశ్లేషణ. ఎస్సీ, ఎస్టీల్లోని యువతను అసాంఘిక శక్తులుగా మార్చి తన రాజకీయం కోసం బలి పశువులు చేయడానికి జగన్ రెడ్డి రెడీ అయ్యారని.. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సందేశం ఇచ్చారు.
నేరగాళ్ల కుటుంబాలకు సంక్షేమ పథకాలు ఆపేయడం అనేది మంచి ఆలోచన అవ్వొచ్చు. గంజాయి, దోపిడీలు, దొంగతనాలు వంటి కేసుల్లో ఇరుక్కుని రౌడీ షీటర్లుగా ఉన్న వారి కుటుంబాల్లో అత్యధికం ప్రభుత్వ పథకాల మీదే ఆధారపడి ఉంటారు. నేరాలు చేసే వారిని ప్రభుత్వమే పోషిస్తున్నట్లుగా పరిస్థితి ఉంటుంది. వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందదు అన్న సంకేతాలు వస్తే బుద్దిగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే… వారికి భయం ఉండటం లేదు.. జగన్ రెడ్డిలాంటి వాళ్లు నేనున్నా .. ప్రజాసొమ్ము పథకాలుగా తీసుకుని ..నేరాలకు పాల్పడండి అని భరోసా ఇస్తూంటే వారు మాత్రం ఎందుకు వెనక్కి తగ్గుతారు?
జగన్ రెడ్డి ఓటు బ్యాంక్ రాజకీయాలపై ఆర్కే పూర్తి స్థాయి విశ్లేషణ చేశారు. తటస్తులు వ్యతిరేకమవుతారని తెలిసినా ఓటు బ్యాంక్ ను పటిష్టం చేసుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి దళిత వర్గాలను బలి చేస్తున్నాడని అంటున్నారు. ఒకప్పుడు నేరగాళ్లతో సంబంధాలు ఉన్నాయని బయటకు తెలిస్తే తమ పరువుపోతుందని రాజకీయ నేతలు అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు రాజకీయాలే నేరగాళ్లతో నిండిపోయాయని.. చాలా ఉదాహరణలు చెప్పారు. వైసీపీకి చెందిన నాయకుల గుణగణాలను విశ్లేషించారు.
ఆర్కే జగన్ రెడ్డి రాజకీయ వ్యూహాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తారు. కానీ ఆయనకు నలభై శాతం ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో జగన్ కు 39 శాతానికి కాస్త ఎక్కువ ఓట్లు మాత్రమే వచ్చాయి. కూటమికి, జగన్ పార్టీకి మధ్య పదహారు శాతం ఓట్ల తేడా ఉంది. రాజకీయాల్లో ఈ పదహారు శాతం అనేది చిన్నది కాదు. పైగా జగన్ రెడ్డి తాను ఎక్కడ నష్టపోయానో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఈ విషయాన్ని ఆర్కే చెప్పడం లేదు. తన సలహాలు పాటించి జగన్ రెడ్డి మారకూడదని ఆయన కోరుకుంటున్నారేమో ?