తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తనను తాను బీఆర్ఎస్ నేతగా చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సోషల్ మీడియాలో తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్టులో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని సంబోధించారు.ఈ ట్వీట్ ఇప్పుడు హైలెట్ అవుతోంది. కేటీఆర్కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్కు మద్దతు తెలుపుతూ పలువురు బీఆర్ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. కవిత కూడా పెట్టారు. చాలా సింపుల్ గా పెట్టిన ట్వీట్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు.
గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఖండిస్తూ ట్వీట్ పెట్టారు. ఇప్పుడు కూడా పెట్టారు. అయితే సంబోధన తేడాగా ఉంది. గతంలో ట్వీట్ పెట్టిన తర్వాత జర్నలిస్టుల్ని చిట్ చాట్కు పిలిచి.. కేటీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనకు పార్టీ నడపడం చేతకావడం లేదన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న పనుల్లో సగం తానే చేస్తున్నానన్నారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బాగుపడేది లేదని ఆ చిట్ చాట్ లో తేల్చేశారు. ఈ ఆఫ్ ది రికార్డు మీడియా సంభాషణ సంచలనం సృష్టించింది. కేటీఆర్ పై ఆమెకు ఉన్న కోపాన్ని బయట పెట్టింది.
ఆ తర్వాత జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. తన సొంత రాజకీయం తాను చేయబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. కానీ కేసీఆర్ విషయంలో ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఆయన ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ రెండు రోజుల కిందట.. కేసీఆర్ .. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు వెళ్లినప్పుడు ఆయనతో పాటు వెళ్లాలనుకున్న ప్రయత్నాలు విఫలయ్యాయి. ఫామ్ హౌస్కు వెళ్లినా కేసీఆర్ మాట్లాడలేదు. ఈ పరిణామంతో కవిత షాక్కు గురయ్యారని చెబుతున్నారు.