జగన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తే సొంతంగా వంద మంది రారు. కానీ పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టి అన్ని జిల్లాల నుంచి తరలించుకుని పెద్ద ఎత్తున జనం వస్తున్నారని ప్రచారం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఉండే ఐదు వందల మందిని ఆయన చుట్టూ మూగేలా చేసుకుంటారు. కెమెరా కూడా ఆ ఐదు వందల మందిని దాటిపోదు. అక్కడే తొక్కిసలాట జరిగి చనిపోతున్నారు. సోషల్ మీడియా వీడియోల కోసం ఇలా ప్రజల్ని బలి చేస్తున్నారు. సత్తెనపల్లిలో జరిగింది ఇదే. జన సమీకరణ కోసం పేదల్ని తీసుకొచ్చి బలి చేస్తున్నారు.
ఐదు వందలు ఆశ చూపి జన సమీకరణ
వైఎస్ జగన్ సత్తెనపల్లి టూర్ వెళ్లాలనుకున్నారు. అది గంట సేపు జర్నీ.. కానీ ఆయన బలప్రదర్శన చేసుకుంటూ ..బెట్టింగ్ చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించాలనుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా తన రెటమతం చూపించారు. గుంటూరులో ఎక్కడెక్కడ.. ఎంతెంతమందిని మోహరించాలో.. ముందుగానే డిసైడ్ చేశారు. ఆ ప్రకారం కాన్వాయ్ ఏటుకూర్ రోడ్ వద్దకు రాగానే.. వెంగళాయపాలెంతో పాటు సమీప గ్రామాల నుంచి తీసుకొచ్చిన జనాల్ని కాన్వాయ్ మీదకు వదిలారు. కుప్పలుతెప్పలుగా జనం వచ్చారని వీడియోలు తీసుకోవడానికి చేసిన డ్రామా ఇది. ఇందులో అత్యధికులకు డబ్బులు ఆశ చూపి తీసుకు వచ్చారు.
జనం తరలి వస్తున్నారని ప్రచారం చేసుకునేందుకు ఎత్తుగడ
జగన్ రెడ్డి వస్తున్నారంటే.. తమ పనులు మానుకుని ప్రాణాలు తీసుకోవాలని ఎవరూ అనుకోరు. ఎవరి పనులు వారికి ఉంటాయి. వారి పనులు మానుకుని రావాలంటే వారికి డబ్బులు ఇవ్వాలి. అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. జగన్ రెడ్డి ఎందుకింత రచ్చ చేస్తున్నారు. రోడ్ షో చేయాలనుకుంటే అనుమతి తీసుకుని చేయవచ్చు. కానీ ఎక్కడ అయినా ప్రజలు, కార్యకర్తల ప్రాణాల్ని బలి చేయాలనుకుంటున్నారు. కేసుల పాలు చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన పర్యటనల్లో శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయి. జనం పెద్ద ఎత్తున వస్తున్నారని ప్రచారం చేసుకునేందుకు వారి ప్రాణాల్ని తీస్తున్నారు.
పేదలూ ఆలోచించాలి – ప్రాణాలు కాపాడుకోవాలి !
రాజకీయ పార్టీలు.. తమ సభలకు జనం వస్తున్నారని చూపించుకోవడానికి ప్రజల్ని సమీకరించుకుంటాయి. అయితే కొన్ని పార్టీలు మాత్రమే వారిని చంపేందుకూ వెనుకాడవు. అలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పేదలు.. కూడా డబ్బులిస్తున్నారని ఆయా పార్టీల సభలకు పరుగులు పెట్టడం.. ప్రాణాలకు ప్రమాదం. పనిలేని యువత.. కుల, మతాల పేరుతో అనుసరించే ముందు కుటుంబాల గురించి ఆలోచించుకోవాల్సి ఉంది.