అధికారంలో లేకపోయినా ప్రతిష్టాత్మక ప్రోగ్రాంలకు ప్రధాన అతిథిగా కేటీఆర్ ను ఆహ్వానిస్తున్నారు. గతంలో లండన్ నుంచి ఇప్పుడు అమెరికా నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి. అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్ హెల్త్ఫెస్ట్ 2025’కు ముఖ్య అతిథిగా కేటీఆర్ను ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ ఆహ్వానాన్ని తాల్ హాస్పిటల్స్ సీఈఓ శ్రీ సాయి గుండవెల్లి హైదరాబాద్లో కేటీఆర్కు స్వయంగా అందజేశారు.
అక్టోబర్ 24, 2025న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (UCSD)లో ఈ ‘హెల్త్ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు , మార్పు తీసుకొచ్చేవారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వ్యక్తిగత వైద్యం, డిజిటల్ హెల్త్కేర్ ఆవిష్కరణలు, సమీకృత వైద్య సంరక్షణ , ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలకు మార్గాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారని తాల్ హెల్త్ ఫెస్ట్ నిర్వాహకులు తెలిపారు.
ఇది అంతర్జాతీయ కార్యక్రమం అని.. కార్యక్రమంలో కేటీఆర్ కీలకోపన్యాసం ఇవ్వనున్నారని తెలిపారు. తెలంగాణలో టెక్నాలజీ ఆధారిత పాలన, ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి , ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన విధానాలు ప్రపంచ ప్రజలకు ఎంతో విలువైనవిగా ఉంటాయని అందుకే ఆయనను పిలిచామని చెప్పారు. ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ అంగీకరించినందుకు టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది. *హెల్త్ఫెస్ట్ 2025’*లో ఆయన భాగస్వామ్యం ఈ వేదికపై అర్థవంతమైన చర్చలకు దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
