కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ( కూటమి ఘనవిజయం సాధించి, సుదీర్ఘ హైడ్రామా తర్వాత వీడీ సతీశన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కేరళ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హడావుడి మలయాళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో హైదరాబాద్లో మకాం వేసి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారనే విమర్శలు ఎదుర్కొన్న ఆమె.. ఇప్పుడు కేరళ సచివాలయం వేదికగా అదే తరహా సమాంతర ప్రభుత్వం నడిపేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అంతా ఆమె ఇష్టమేనా?
కేరళ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు పది రోజుల పాటు సీఎం ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నడిచింది. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల వంటి హేమాహేమీలు రేసులో ఉన్నప్పటికీ, ఏఐసీసీ పరిశీలకులతో కలిసి గ్రౌండ్ లెవల్ రిపోర్టుల ఆధారంగా వీడీ సతీశన్ వైపు హైకమాండ్ మొగ్గు చూపేలా చేయడంలో దీపాదాస్ మున్షి కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మిత్రపక్షాలైన ఐయూఎంఎల్ కి కీలక పోర్ట్ఫోలియోలు కేటాయించడం, ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు కాంగ్రెస్ కోటా మంత్రుల శాఖల కేటాయింపుల వెనుక కూడా ఆమె షాడో హ్యాండ్ స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు ప్రారంభమయ్యాయి.
నాడు హైదరాబాద్.. నేడు తిరువనంతపురం!
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పనిచేసిన సమయంలో దీపాదాస్ మున్షి వ్యవహరించిన తీరును మలయాళ పొలిటికల్ సర్కిల్స్ ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాయి. నాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. అధికారుల బదిలీలు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలతో పాటు ప్రభుత్వ విధానాల స్క్రీనింగ్లోనూ ఆమె జోక్యం మితిమీరిపోయిందనే టాక్ నడిచింది. ఏకంగా గాంధీ భవన్ నుంచే సచివాలయ సమీక్షలను నియంత్రించే ప్రయత్నం చేశారని అప్పట్లో బీఆర్ఎస్, బీజేపీ విమర్శించాయి. ఇప్పుడు సరిగ్గా అదే తరహా వ్యూహాన్ని కేరళలోనూ అమలు చేస్తూ, ప్రతి చిన్న నిర్ణయానికీ ఏఐసీసీ మార్క్ ఆమోదం ఉండాల్సిందేనంటూ పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీ పెత్తనం పై మిత్రపక్షాల అసంతృప్తి?
దీపాదాస్ మున్షి నడిపిస్తున్న ఈ తరహా హైకమాండ్ పాలిటిక్స్పై కేరళ కాంగ్రెస్ , ముస్లిం లీగ్ వంటి కూటమి భాగస్వామ్య పక్షాలలో అంతర్గతంగా అసంతృప్తి మొదలైనట్లు సమాచారం. కేరళ రాజకీయాల్లో గ్రూపు తగాదాలు చాలా ఎక్కువ. స్థానిక నేతలను, సీనియర్లను కాదని ఢిల్లీ ఇన్ఛార్జ్ నేరుగా ఫైళ్లను, కేబినెట్ అజెండాలను శాసించాలని చూడటం ప్రాంతీయ ఆత్మగౌరవానికి దెబ్బ అనే భావన వ్యక్తమవుతోంది. సీఎం సతీశన్ భవిష్యత్తులో ఆమె షాడో నుంచి బయటపడి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకపోతే.. ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
