ప్రతీ సినిమాకీ పబ్లిసిటీ అవసరమే. చిన్న సినిమాలకూ, కొత్త సినిమాలకూ మరింత అవసరం. ఐతే ఆ సినిమా బడ్జెట్ తో మరో చిన్న సినిమా తీసేంత రేంజులో అయితే పబ్లిసిటీ అవసరం లేదనుకుంటా. జాగ్వార్ హడావుడి చూస్తే అదే అనిపిస్తోంది. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఈ సినిమా హీరో. జాగ్వార్ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి కళ్ళ ముందు కనిపిస్తోంది. ఏ నిర్మాత అయినా హీరో మార్కెట్ వాల్యూ ని బట్టే ఖర్చు పెడతాడు. కానీ హీరో ఇక్కడ ఓ మాజీ ప్రధానికి మనవడు, ఓ మాజీ ముఖమంత్రి తనయుడు. అందుకే డబ్బు వెదజల్లారు. ఈ సినిమాకి రూ. 70 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఆ లెక్కన ఇది సౌత్ ఇండియాలోనే ఖరీదైన డెబ్యూ.
టేకింగ్ కి అయిన ఖర్చు పక్కన పెడితే పారితోషికాల రూపంలో భారీ మొత్తం చెల్లించారట. ఉదాహరణకు జగపతి బాబు పారితోషికం 50 లక్షలు అనుకుందాం. ఈ సినిమాకి కోటిన్నర ఇచ్చారన్నమాట. కేవలం విజయేంద్ర ప్రసాద్ కథ కోసమే రూ. 75 లక్షలు ఇచ్చారట. ఇప్పుడు పబ్లిసిటీ పై పడ్డారు. అందుకోసం రూ. 7 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఆదివారం జరిగిన ఆడియో వేడుక భారీ ఎత్తున సాగింది. ఓ స్టార్ హీరో స్థాయిలో జరిగింది. ఇందుకోసం పొలిటికల్ మీటింగ్ లా జనాన్ని సమీకరించారట. రాయచూర్ నుంచి 1000 మందిని దింపారని తెలుస్తోంది. ఎంత హంగామా చేసినా కథలో, సినిమాలో దమ్ము ఉండాలి. లేదంటే సినిమా చూడ్డానికి కూడా జీతాలిచ్చి జనాలని దింపాల్సి వస్తుంది. మరి ఆ దమ్ము ఇందులో ఉందొ లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాలి.