కాపులకి రిజర్వేషన్లు అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి అవసరమైన సిఫార్సులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాధ కమీషన్ నేటి నుంచి చిత్తూరు జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటించబోతోంది. తిరుపతి మునిసిపల్ కార్యాలయంలో ఈరోజు కాపుల నుంచి అర్జీలు, సలహాలు, సూచనలు, అభిప్రాయలు స్వీకరిస్తుంది. అనంతరం జిల్లా పర్యటనలకి బయలుదేరుతుంది. అయితే మంజునాథ కమీషన్ ఏర్పాటు చేసిన 9 నెలల తరువాత అది ఇప్పుడు కాపుల ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థితిగతుల గురించి అధ్యయనం చేసేందుకు జిల్లా పర్యటనలకి బయలుదేరడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
కాపుల రిజర్వేషన్లు కోసం త్వరలోనే చాలా బారీ స్థాయిలో ఉద్యమం మొదలుపెడతానని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరించడం, ఆయన ఉద్యమానికి చిరంజీవి, దాసరి నారాయణరావుతో సహా ఈసారి వైకాపా కూడా బహిరంగంగా మద్దతు తెలపడానికి సిద్దపడటంతో అప్రమత్తం అయిన రాష్ట్ర ప్రభుత్వం మంజునాధ కమీషన్ జిల్లా పర్యటనలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందేమో? అనే అనుమానం కలుగుతోంది. తద్వారా ఒకవేళ ముద్రగడ పద్మనాభం మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టినట్లయితే, ప్రభుత్వం ఆయనని గట్టిగా ఎదుర్కోగలదు. ఒకవైపు తమ ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్లు కల్పించేందుకు మంజునాథ కమీషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తుంటే, ముద్రగడ పద్మనాభం రాజకీయ దురుదేశ్యంతోనే ఉద్యమాలు చేస్తున్నారని ప్రభుత్వం ఆయనని నిందించగలదు. ముద్రగడకి కాపులకి రిజర్వేషన్లు సాధించాలనే తపన కంటే, వైకాపాకి అనుకూలంగా దాని ప్రోత్సాహంతో రాజకీయాలు చేయడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని విమర్శించగలుగుతుంది. ఆ విధంగా ఒకేసారి ముద్రగడని, ఆయనని ప్రోత్సహిస్తున్న వైకాపాకి ఒకేసారి చెక్ పెట్టవచ్చని తెదేపా ఉద్దేశ్యం కావచ్చు. బహుశః అందుకే హటాత్తుగా మంజునాథ్ కమీషన్ రాష్ట్ర పర్యటనకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందేమో?