పాకిస్తాన్ కి ఊహించని షాక్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత ఆర్మీ కాశ్మీర్ సరిహద్దు వైపున్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సుమారు 3 కి.మీ. లోపలకి భారత్ సైనికులు చొచ్చుకుపోయి అక్కడ 7 ఉగ్రవాదులు స్థావరాలని, సుమారు 35 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టారు. అర్ధరాత్రి తరువాత మొదలైన ఈ ఆపరేషన్ తెల్లవారు జమున 4.30 గంటల వరకు సాగింది. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సైనికులని ఆర్మీ హెలికాఫ్టర్లలో ఆ ప్రాంతంలో పారాచూట్స్ ద్వారా జార విడిచారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకొని అందరూ క్షేమంగా తమ క్యాంప్ కి చేరుకొన్నారు. ఈ ఆపరేషన్ లో భారత సైనికులు ఎవరూ గాయపడలేదని లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ (డిజిఎంఒ) మీడియాకి తెలిపారు. అక్కడ చాలా మంది ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు నిఘా వర్గాలు అందించిన సమాచారం ఆధారంగానే తాము ఈ ఆపరేషన్ నిర్వహించామని ఆయన చెప్పారు. మళ్ళీ మరోసారి అటువంటి మిలటరీ ఆపరేషన్ నిర్వహించే ఆలోచన లేదని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ అనుమతితోనే ఈ ఆపరేషన్ నిర్వహించబడిందని వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు సాయంత్రం 4గంటలకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఈ ఆపరేషన్ గురించి, దానికి అనివార్యత గురించి వారికి వివరించబోతున్నారు.
దీనిపై భారత్ లో సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పాకిస్తాన్ మండిపడింది. కానీ పాక్ భూభాగంలోకి భారత్ సైనికులు చొరబడి సర్జికల్ స్ట్రయిక్ చేశారని అంగీకరించడం లేదు. పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఈ మెరుపు దాడులపై స్పందిస్తూ, “దానిని సర్జికల్ స్ట్రయిక్ గా మేము భావించడం లేదు. సరిహద్దుల వద్ద జరిగిన కాల్పులలో మా సైనికులు ఇద్దరు మరణించారు. కొందరు గాయపడ్డారు. మేము భారత్ తో శాంతి, స్నేహమే కోరుకొంటున్నాము. మా సహనాన్ని భారత్ అసమర్ధతగా భావించవద్దని హెచ్చరిస్తున్నాము. భారత్ అత్యుత్సాహం ప్రదర్శిస్తే దానిని ఎదుర్కోవడానికి మేము కూడా సిద్దంగానే ఉన్నాము,” అని అన్నారు.