బెంగాల్ టైగర్ తరవాత మరో సినిమా పట్టాలెక్కించడానికి బాగా టైమ్ తీసుకొన్నాడు రవితేజ. పవర్ దర్శకుడు బాబి చెప్పిన కథకు రవితేజ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. రేసుగుర్రం రైటర్తోనూ సినిమా చేయడానికి అంగీకరించాడు. వీటిలో ముందుగా పట్టాలెక్కేది బాబి సినిమానే. ఈసినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. దసరాకి ఈ చిత్రాన్ని లాంఛనంగా మొదలెడతారని తెలిసింది. ఇప్పుడుకథానాయిక కూడా ఫైనలైజ్ అయ్యిందని టాక్. రవితేజ పక్కన రాశీఖన్నాని ఎంచుకొన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రవితేజ – రాశీఖన్నా ఇది వరకు బెంగాల్ టైగర్లో జోడీ కట్టారు. ఇది రెండో సినిమా అన్నమాట.
సర్దార్ గబ్బర్సింగ్ తరవాత బాబి బాగా డల్ అయ్యాడు. పవన్ సినిమాకి దర్శకత్వం వహించానన్న ఆనందం.. ఆసినిమా ఫలితం ఎగరేసుకొని పోయింది. అయితే సర్దార్ ఫ్లాప్ వెనుక.. బాబీ ప్రమేయం అంతంత మాత్రమే అని తెలుసుకొన్న రవితేజ.. బాబికి కబురు పంపాడు. పవర్ టైమ్లోనే బాబితో మరో సినిమా చేస్తా అని రవితేజ మాటిచ్చాడట. దానికితోడు రవితేజ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పవర్ సినిమానే కాస్త ఉపశమనం ఇచ్చింది. బాబి టాలెంట్ తెలిసిన రవితేజ.. సర్దార్ ఫ్లాప్ లెక్క చేయకుండా బాబికి సినిమా అందించాడు. అందుకే బాబి కూడా ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పి రవితేజని ఇంప్రెస్ చేసేశాడు. ఈసినిమా కోసం రవితేజ తన పారితోషికాన్ని కూడా తగ్గించుకొన్నాడని టాక్.