భారత్ సర్జికల్ దాడుల తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్ లోని నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. అవసరమైతే భారత్ పై అణుబాంబు వేస్తామంటూ కొందరు పాక్ నేతలు పదే పదే బెదిరిస్తున్నారు. శుక్రవారం పాక్ రక్షణ శాఖ మంత్రి కూడా ఇలాగే వ్యాఖ్యానించారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. పదే పదే అలాంటి కామెంట్స్ మానుకోవాలంటూ నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.
తన భూభాగంలో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను కొనసాగనివ్వ కూడదని అమెరికా మరోసారి హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన సంస్థలన్నింటిమీదా ఉక్కుపాదం మోపాల్సిందేనని తేల్చిచెప్పింది. కొన్ని సంస్థలను టార్గెట్ చేయడం, భారత్ కు వ్యతిరేకంగా కొన్ని సంస్థలను పెంచి పోషించడం మానుకోవాలని హెచ్చరించింది.
భారత్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోవాలని ఇటీవలి కాలంలో అమెరికా అనేక సార్లు పాక్ కు సూచించింది. అయినా అది పెడచెవిన పెట్టింది. దానికి పలితం అనుభవిస్తోంది. భారత్ లక్షిత దాడుల తర్వాత పాక్ తరఫున మాట్లాడే దేశమేదీ లేకుండా పోయింది. చివరకు చైనా కూడా పాక్ కు అండగా ప్రకటన ఏదీ చేయలేదు. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ నే తిడుతోంది. ఉగ్రవాద సంస్థల మధ్య తేడాలుచూపవద్దని , ముష్కరులందరినీ టార్గెట్ చేయాలని అన్ని దేశాలూ సూచిస్తున్నాయి.
ప్రస్తుతం పాక్ పరిస్థితి తేలుకుట్టిన దొంగలా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై భారత్ మరోసారి దాడి చెయ్యదనే గ్యారంటీ లేదు. అలాగని వాటిని మూసేస్తే టెర్రరిస్టులు పాక్ పాలకులనే టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. తన భూభాగంలోని తీవ్రవాద శిబిరాలను మూసెయ్యడం కూడా పాకిస్తాన్ కు కష్టమే కావచ్చు. వాటికి ఆర్మీ, ఐఎస్ఐ అండ ఉంది. కాబట్టి ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవడం మినహా ఏమీ చేయలేకపోవచ్చు. ఆర్మీ ఏదైనా దుందుడుకు నిర్ణయం తీసుకుంటే భారత్ అతి కర్కశంగా తిప్పి కొడుతుంది. అటు అంతర్జాతీయంగానూ మద్దతు భారత్ కే ఉంది. ఉంటుంది. అందుకే, పాక్ పాలకులకు దిక్కుతోచడం లేదు. భారత్ మాత్రం దేనికైనా రెడీగానే ఉంది.