చిత్రసీమలో ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో, ఎందుకు విడిపోతారో అర్థం కాదు. వాళ్ల నిర్ణయాలన్ని అప్పటికప్పుడు `సినిమాటిక్`గా మారిపోతుంటాయి. ప్రేమలో పడడం.. విడిపోవడం రొటీన్ కార్యక్రమంలా కనిపిస్తుంటుంది. అందుకే చిత్రసీమలో ప్రేమలన్నీ దాదాపు విషాదాంతాలుగా మిగిలిపోతాయి. తాజాగా విశాల్ ప్రేమకథకూ శుభం కార్డు పడిపోయినట్టు తమిళ చిత్రసీమ కోడై కూస్తోంది. శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి తో విశాల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఏడేళ్ల నుంచి ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు వార్తలొచ్చాయి. 2017లో నా పెళ్లి అంటూ విశాల్ కూడా చెప్పేశాడు. తమిళ నడిగర్ సంఘం నిర్మిస్తున్న కల్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని విశాల్ ప్రకటించాడు కూడా! ఆ పెళ్లి వరలక్ష్మితోనే అనుకొన్నారంతా. అయితే.. తాజాగా వరలక్ష్మి ట్విట్టర్ లో చేసిన కామెంట్ చూస్తే విశాల్తో తన బంధం తెగదెంపులు అయిపోయిందేమో అన్న అనుమానం కలుగుతోంది. “ప్రేమంటే ఇంతేనా? ప్రపంచంలో ప్రేమ ఏమైపోతుందో? ఎక్కడుందో?” అంటూ ట్వీట్ చేసింది వరలక్ష్మి. ఇది విశాల్ గురించేనని కోలీవుడ్ కోడై కూస్తోంది. నడిగర్ సంఘం ఎన్నికల నంచి విశాల్ – శరత్ కుమార్ ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. విశాల్తో పెళ్లికి శరత్ కుమార్ కూడా ముందు నుంచి సముఖంగా లేడు. అందుకే విశాల్ వరలక్ష్మిని దూరం చేసుకోవాలని భావిస్తున్నాడట. ఈమాటే వరలక్ష్మికి నేరుగా చెప్పేశాడని, అందుకే ఆమె ఇలా స్పందించిందని చెబుతున్నారు. విశాల్ మనసు విప్పి మాట్లాడితే గానీ, ఈ విషయంపై ఓ క్లారిటీ రాదు.