ఆపరేషన్ కగార్ పేరుతో.. నక్సలైట్లను నిర్మూలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాల్పుల విరమణ, చర్చలు వంటి ప్రతిపాదనలకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం నక్సలైట్లకు ఓ ఆఫర్ ఇచ్చారు. అందరూ హింసను వదిలేసి.. లొంగిపోవాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన అమిత్ షా బహిరంగసభలో మాట్లాడారు.
దేశంలో నక్సలిజం లేకుండాచేయాలన్నది మోదీ లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది మార్చి 30లోపు నక్సలిజాన్ని అంతం చేస్తామన్నారు. నక్సలైట్లు అందరూ జన జీవన స్రవంతిలోకి రావాలని ఇప్పటికే పది వేల మంది లొంగిపోయారని గుర్తు చేశారు. నక్సలైట్ల ప్రధాన స్థావరాల్ని గుర్తించి.. భద్రతా బలగాలు దాడులు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున నక్సలైట్లు ఎదురు కాల్పుల్లో చనిపోతారు. ఇందులో అగ్రనేతలు కూడా ఉన్నారు.
నక్సల్స్ ఉద్యమానికి ఆదరణ తగ్గడం, కొత్తగా ఆ ఉద్యమంలో చేరేవారు కూడా లేకపోతూండటంతో రోజు రోజుకు మావోయిస్టు క్యాడర్ బలహీనపడుతోంది. ఉన్న కొద్ది మంది అగ్రనేతల్ని కూడా పట్టుకుని కాల్చి చంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని మావోయిస్టు సానుభూతిపరుల నుంచి కూడా.. లొంగిపోయి.. ప్రజాస్వామ్య పథంలో పోరాటం చేయాలన్న సూచనలు వస్తున్నాయి. ఇప్పుడు అమిత్ షా కూడా అలాంటి ఆఫరే ఇస్తున్నారు. మరి ముఖ్యనేతలంతా ఈ ఆఫర్ వినియోగించుకుంటారా ?