జనతా గ్యారేజ్ హంగామా ఓ రేంజులో సాగుతోంది. అర్థరాత్రి ప్రీమియర్ షోల్లో కనిపించిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇది వరకు ఎన్టీఆర్ సినిమాకెప్పుడూ లేని స్థాయిలో.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. హైదరాబాద్లో దాదాపు 10 థియేటర్లలో ఫ్యాన్స్ షోలు వేశారు. పది చోట్లా హౌస్ ఫుల్సే. సరిగ్గా అర్థరాత్రి 3 గంటలకు షోలు పడిపోయాయి. థియేటర్లలో మాత్రం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన గోల అంతా ఇంతా కాదు. అయితే.. అదే సమయంలో థియేటర్లో అనూహ్యంగా జై.. బాలయ్య నినాదాలూ మిన్నంటాయి. ఓ సందర్భంలో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. – జై ఎన్టీఆర్ అనీ, ఇటు బాలయ్య ఫ్యాన్స్ జై.. జై బాలయ్య అంటూ.. అరుపులతో థియేటర్ని మోతెక్కించారు. చూస్తుంటే పరిస్థితి ఉదృతంగా మారేట్టే కనిపించింది. కానీ.. మళ్లీ.. ‘ఒక్కటే ఒక్కటే.. మనమంతా ఒక్కటే’ అంటూ నినాదాలు చేయడం ఆసక్తిని కలిగించింది. ఇంచు మించు చాలా థియేటర్లలో ఇదే పరిస్థితి. బాలయ్య – ఎన్టీఆర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న విషయం పరిశ్రమ కోడై కూస్తోంది. నందమూరి ఫ్యాన్స్ కూడా చెరో వైపుకు చేరిపోయారు. అప్పట్టుంచీ బాలయ్య ఫ్యాన్స్ , ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ డివైడ్ అయిపోయారు. అయితే.. జనతా గ్యారేజ్ కోసం ఇద్దరి ఫ్యాన్స్ కలిసిపోయినంత సంబరం కనిపించింది. మనమంతా ఒక్కటే అంటూ.. అరచుకోవడం కూడా ఓ సరికొత్త వాతావరణానికి నాంది పలికినట్టైంది. సినిమా ఎలా ఉన్నా… థియేటర్లలో ఫ్యాన్స్ చేసిన హంగామా, జై బాలయ్య నినాదాలూ… అందరికీ గుర్తుండిపోతాయి.