బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం పార్టీలో అగ్గి రాజేసింది. ఆమె వరుసగా పార్టీని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తుండటంతో అసలు కవితేనా ఇలా చేస్తున్నది అని నోరెళ్ళబెట్టేస్తున్నారు.కల్వకుంట్ల ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది అన్నది ఎవరికీ ఓ క్లారిటీ రావడం లేదు. కానీ, కవిత మాత్రం తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారాయి.
కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని సమాచారం. కవితను కట్టడి చేయకపోతే పార్టీకి డ్యామేజ్ అవుతుందని ఆయన అలోచిస్తున్నారు. అందుకే మరోసారి మధ్యవర్తుల ద్వారా రాయబారం నడపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ దఫా ఎంపీ దామోదర్ రావు, న్యాయవాదితో రాయబారం నడిపిన వర్కౌట్ కాలేదు సరికదా డోస్ పెంచేశారు కవిత. దీంతో చివరిసారిగా కల్వకుంట్ల ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్ ను మధ్యవర్తిగా పంపాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
మీడియా చిట్ చాట్ లో వినోద్ మాట్లాడుతూ.. కవితతో తాను మాట్లాడుతానని అనడం వెనక కేసీఆర్ ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే కవిత ఇష్యూ రాజకీయమైనదే అయినా, ఫ్యామిలీతో విబేధాలతో ప్రారంభమైంది. అంటే మధ్యవర్తులు అందులో ఎవరూ దూరిన అది మరింత పెద్దది అవుతుంది. అందుకే కవిత, కేటీఆర్ కు సన్నిహితంగా ఉండేవారు ఎవరూ ఆమెతో మధ్యవర్తిత్వం వహించే సాహసం చేయలేకపోతున్నారు. ఇప్పుడు వినోద్ కుమార్ తను మాట్లాడుతానని అన్నాడంటే.. ఖచ్చితంగా కేసీఆర్ ప్రతినిధిగానే ఆయన ఈ కామెంట్స్ చేసి ఉంటారని వాదన వినిపిస్తోంది.