ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుని విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం రోడ్షోలు నిర్వహిస్తూ పారిశ్రామిక వేత్తలను ఇప్పటికే ఆహ్వానిస్తోంది.
ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఐటీసీ మౌర్యలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. విశాఖ భాగస్వామ్య సదస్సు కూడా సీఐఐ ఆధ్వర్యంలోనే సాగనుంది. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి ఆ తర్వాత అక్కడి నుంచి విశాఖకు వస్తారు.
అక్టోబర్ 1వ తేదీన విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 02.40 గంటలకు పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారు.
భాగస్వామ్య సదస్సును విజయవంతంగా నిర్వహించి దిగ్గజ పారిశ్రామిక సంస్థల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నారా లోకేష్ పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.