తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“ఇదివరకు నేను ఏదైనా పని చెపితే లోకేష్ దానిని వెంటనే పూర్తి చేసేవాడు. కానీ ఇప్పుడు ఆ స్పీడ్ తగ్గినట్లు కనిపిస్తోంది. లోకేష్ మళ్ళీ తన స్పీడ్ పెంచుకోవాలి. అతనే కాదు పార్టీలో అందరూ కూడా స్పీడ్ పెంచాలి. లేకుంటే నేను ఎవరినీ వదిలిపెట్టను,” అని అన్నారు.
చంద్రబాబు తన కుమారుడుని హెచ్చరించదలచుకొంటే ఇలాగ బహిరంగంగా కాకుండా నేరుగానే హెచ్చరించవచ్చు కానీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతలతో ఈ మాట అనడమే విచిత్రంగా ఉంది. లోకేష్ స్పీడ్ తగ్గిన మాట వాస్తవమే కనుక ఆయన నిజంగానే లోకేష్ ని ఈవిధంగా హెచ్చరించారా లేకపోతే లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకొనే ఉద్దేశ్యమున్నట్లు ఇదివరకే చెప్పారు కనుక అందుకు రంగం సిద్దం చేసేందుకే ఈ మాట అన్నారా? అనే అనుమానం కలుగుతోంది.
లోకేష్ స్పీడ్ పెంచడం సంగతి ఎలాగున్నా ఆయన గురించి చంద్రబాబు నాయుడు అన్న ఈ మాటలపై మీడియాలో మళ్ళీ ఎంతో కొంత ఈవిధంగా చర్చ జరుగుతుంది. కనుక లోకేష్ పార్టీలో నిర్వర్తిస్తున్న భాద్యతల గురించి, మంత్రివర్గంలోకి తీసుకొంటే మంచిదా లేకపోతే ఆయన సేవలని పార్టీకే ఉపయోగించుకోవాలా అనే విషయంపై పార్టీ నేతలు కూడా మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టవచ్చు. తద్వారా లోకేష్ ని మళ్ళీ మీడియా, ప్రజల దృష్టిలోకి వస్తారు. బహుశః అందుకే చంద్రబాబు నాయుడు లోకేష్ తో వ్యక్తిగతంగా ఈ మాట చెప్పకుండా సమన్వయ కమిటీ సమావేశంలో అన్నారేమో?