సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అమలుచేసిన అనేక సంక్షేమ పధకాల వలన ఆయనకి ప్రజలలో ఎంత గొప్ప పేరు సంపాదించుకొన్నారో, అభివృద్ధి పేరిట ప్రైవేట్ సంస్థలకి, వ్యక్తులకి ప్రభుత్వ భూములని అప్పనంగా పంచి పెట్టి అంతకంటే చాలా ఎక్కువ చెడ్డపేరు సంపాదించుకొన్నారు. ఆయన కొడుకు జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ప్రభుత్వ ఆస్తులని ఒక ధర్మకర్తగా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. కనుక అభివృద్ధి పేరిట ప్రభుత్వ భూములని ప్రైవేట్ సంస్థలకి లేదా వ్యక్తులకి కట్టబెట్టడాన్ని ఎవరూ హర్షించలేరు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసిన ఆ తప్పులని విమర్శిస్తూ, వివిధ సంస్థలకి ఇచ్చిన భూములని వెనక్కి తీసుకొన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో శ్రీమత్ ఉభయ వేదాంతచార్య పీఠానికి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తర్లిపేటలో 209.84 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకే కట్టబెట్టాలని నిశ్చయించుకొన్నారు. దానిలో ఎకరం రూ.1.50 లక్షల చొప్పున 50 ఎకరాలని, మిగిలిన 159.84 ఎకరాలని ఎకరం కేవలం రూ.50,000 నామ మాత్రపు ధరకి కట్టబెట్టాలని నిర్ణయించారు. అక్కడ ఆ సంస్థ రూ.350 కోట్లు వ్యయంతో వేదిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తుంది.
రాష్ట్రంలో నిరుపేదలు ఇళ్ళు కట్టుకోవడానికి 60 గజాల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం చాలా ఆలోచిస్తుంది. ఇక రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థలు లే-అవుట్లు వేస్తే సామాన్య, మధ్యతరగతి ప్రజల నుండి వీలైనంత ఎక్కువ ధర పిండుకోవడానికి వేలంపాటలు నిర్వహిస్తుంటాయి. ఒక ఇల్లు ఏర్పరచుకోవాలనే మధ్యతరగతి కుటుంబాల జీవిత స్వప్నం సాకారం చేసుకోవడానికి అపార్టుమెంటులో ఒక చిన్న ఫ్లాట్ కొనుగోలుకి తమ జీవిత కాలమంతా కష్టపడి సంపాదించింది ధార పోస్తుండటం అందరికీ తెలుసు. తమకి ఓట్లు వేసి ఈ అధికారం కల్పించిన అటువంటి సామాన్య, మధ్య తరగతి ప్రజల గురించి చంద్రబాబు నాయుడు ఆలోచించకుండా ఇటువంటి ప్రైవేట్ సంస్థల గురించి మంత్రివర్గ సమావేశంలో ఆలోచించడం, వాటికి కారుచవకగా వందలాది ఎకరాలు కట్టబెట్టడం ఎవరూ హర్షించలేరు.
అదే అక్కడ ఒక బారీ పరిశ్రమ ఏర్పాటుకి ఇచ్చి ఉండి ఉంటే దాని వలన ఆ జిల్లాలో ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడి ఉండేవి. కానీ పెద్దపెద్ద పరిశ్రమలు, ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ సంస్థలనన్నిటినీ అమరావతి పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసుకొంటూ రాష్ట్రంలో ఏ అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడి ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ధార్మిక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తుండటం, దాని కోసం కారుచవకగా ప్రభుత్వ భూమిని అప్పగించడం చాలా శోచనీయం.
కేంద్రప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి తగినంత సహాయ సహకారాలు అందించడం లేదని విమర్శిస్తున్న తెదేపా ప్రభుత్వం, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి చేయకుండా అదే విధంగా వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు.