ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో రకరకాల సమస్యలు పై అసంతృప్తి ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇష్టంగా భూమి అప్పగించిన వారికి కూడా ఆశాభంగం కలుగుతున్నది. తొలి దశలో ప్రభుత్వ మాటలు ఏ మేరకు విశ్వసించాలో తెలియక వూగిసలాడుతున్న రైతులను ఒప్పించేందుకై మంత్రులు పుత్తిపాటి పుల్లారావు, నారాయణ వంటివారు రంగంలోకి దిగారు.మీకు మీ వూళ్ల దగ్గర్లోనే ప్లాట్ల కేటాయింపు వుంటుందని భరోసాగా చెప్పారు. సభల్లో ప్రశ్నలు సమాధానాల తతంగం నడిపించారు. ఇది నమ్మి చాలా మంది భూములు అప్పగించి దగ్గరలోనే వాణిజ్య ప్లాట్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఆ విధమైన కేటాయింపులు నడుస్తున్నాయని రైతులు చాలా ఆనందంగా వున్నారని కొన్ని పత్రికల్లోనూ చానళ్లలోనూ కథనాలు ప్రసారం అవుతున్నాయి. రైతులు మాట్లాడ్డం కూడా చూపిస్తున్నారు. అది నాణేనికి ఒక వైపు మాత్రమే. తమకు ఇస్తామన్నచోట గాక మరోచోట దూరంగా విలువ తక్కువ ప్లాట్లు కేటాయించారని తెలుగుదేశం అనుకూల రైతులు కూడా నిరసన తెల్పుతున్నారు. పాలకపక్షానికి మద్దతుగా నిలిచే వెంకటపాలెం గ్రామానికి చెందిన వారికే వాగ్దానభంగం ఎదురైంది. తమకు పెనుమాక సమీపంలో ప్లాట్లు ఇవ్వడమేమటని వారు అధికారులను నిలదీశారు. శాఖమూరు రైతులూ ఇలాగే రగిలిపోయారు. మొదట చెప్పిన చోట గాక మరోచోట ప్లాట్ట కేటాయింపులు చేయడమంటే మోసగించడం కాదా అని ప్రశ్నించారు. క్యాపిటల్సిటీ ప్లానుతో పాటు కొండవీటి వాగు పరివాహక ప్రాంతాన్ని మార్చడం వల్ల ప్లాను మారిందని అధికారులు ఇచ్చే వివరణ వారికి ఏ మాత్రం మింగుడు పడటం లేదు.5 దొండపాటు పిచుకలపాలెం గ్రామాలలోనూ ఇలాటి సమస్యలే వస్తున్నాయి.