రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత రెండున్నరేళ్ళుగా కొనసాగుతున్న కృష్ణా, గోదావరి జలవివాదాలని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు సూచనతో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. కేంద్ర జలనవరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో రేపు మధ్యాహ్నం 2గంటలకి జరుగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు సాయంత్రమే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మ, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు, ఆ శాఖకి చెందిన ఉన్నతాధికారులు, ఇంజనీర్లు డిల్లీకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన బృందం రేపు ఉదయం బయలుదేరుతారు.
ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాగునీటి ప్రాజెక్టులు, నీటి పంపకాలపై తమ తమ వాదనలు వినిపిస్తారు. ఆ తరువాత కేంద్రమంత్రి ఉమాభారతి తన అభిప్రాయాలని, సలహాలని, సూచనలని తెలియజేస్తారు. అయితే ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలు, వైఖరికే కట్టుబడి ఉండాలని కృత నిశ్చయంతో ఉన్నందున ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఏవో అద్భుతాలు జరిగిపోతాయని ఆశించలేము. తెలంగాణా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నందున ఆ ఆలోచన విరమించుకొనే అవకాశాలు బొత్తిగా లేవనే చెప్పవచ్చు. వాటి వలన దిగువనున్న ఆంధ్రాకి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గట్టిగానే పట్టుపట్టవచ్చు. రెండు ప్రభుత్వాలు పట్టువిడుపులు ప్రదర్శించడానికి సిద్దపడితే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటి వాడకంలో రాజీపడే అవకాశాలు కొంచెం ఉన్నాయి.
సాగునీటి ప్రాజెక్టులు, నీటి పంపకాల వ్యవహారాలు కేవలం వ్యవసాయానికే పరిమితం అయ్యుంటే ఈ సమస్య కి తప్పకుండా పరిష్కారం దొరికి ఉండేది. కానీ వాటి వెనుక రాజకీయకోణాలు కూడా ఉన్నందున సమస్య జటిలం అయిపోయిందని చెప్పవచ్చు. కనుక ఈ సమస్య నుంచి రాజకీయాలని వేరుచేయగలిగినప్పుడే అది పరిష్కారం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదు కనుక ఈ సమస్యకి పరిష్కారం కనుగొనడం కూడా అసాధ్యమేనని భావించవచ్చు.