పదవుల పంపకం అనేది కాంగ్రెస్ పార్టీలో జీడిపాకం సీరియల్ లా సాగుతున్నా ఆశావహులు మాత్రం అలసి పోవడం లేదు. ఎక్కే గడప..దిగే గడప అన్నట్లుగా తిరుగుతూనే ఉన్నారు. ఏ స్థాయిలో ఎవరు ప్రబావితం చేయగలరన్నది చూసుకుని మరీ వెంట పడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఈ నేతల తాకిడి ఎక్కువగా ఉంది. ఆమె ఢిల్లీలో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా.. పనిగట్టుకుని కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
తాజాగా అద్దంకి దయాకర్ తో పాటు పలువురు బీసీ వర్గ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ ను కలిసి తమ ఆకాంక్షలు వెల్లడించారు. కొంత మంది అయితే మంత్రి పదవి లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ అని బేరాలు పెట్టినట్లుగా తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. మీనాక్షి నటరాజన్ ఇప్పటికే ఓ ఫార్ములా రెడీ చేసి ఆ ప్రకారం పదవుల పంపకానికి సిఫారసులు చేశారు. ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.
పదవుల పంపకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు హైకమాండ్ కు తీరిక దొరకడం లేదు. ఇటీవల మూడు పార్టీ కమిటీల్ని ప్రకటించారు. వాటి వల్ల ఉపయోగమేంటో ఆ పదవులు పొందిన వారికీ అర్థం కాలేదు. అసలైన పదవుల కోసం వారంతా ఎదురు చూస్తున్నారు.