‘గరుడ వేగ’తో కాస్త పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు ప్రవీణ్ సత్తారు. కావల్సిన బడ్జెట్ ఇవ్వగలిగితే – ప్రవీణ్ మంచి కమర్షియల్ సినిమానే తీయగలడు అని ఆ సినిమా నిరూపించింది. అందుకే రామ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. స్రవంతీ మూవీస్ లో ఈ సినిమా కొబ్బరికాయ కొట్టుకుంది. అయితే బడ్జెట్ ని భరించలేని స్రవంతి… ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో రామ్ సినిమా ఆగిపోయింది. ఈ కథ ఇప్పుడు ధనుష్తో చేయడానికి ప్రవీణ్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ధనుష్కి మార్కెట్ ఉంది. బడ్జెట్ కాస్త పెరిగినా – రెండు భాషల్లో విడుదల చేసుకోవొచ్చు కాబట్టి – ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. అందుకే… ప్రవీణ్ దృష్టి ధనుష్పై పడినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ ధనుష్ అప్పాయింట్మెంట్ కూడా తీసుకున్నాడని, `కాలా` రిలీజ్ తరవాత… ధనుష్ని కలసి కథ చెప్పడానికి సమాయాత్తం అవుతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ధనుష్ ఒకే అంటే.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈసినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉంది.