తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమ, యాక్షన్, కామెడీ, చిన్న బడ్జెట్, భారీ బడ్జెట్, సెట్టింగ్స్, సాంకేతిక పరిజ్ఞానం ఇలాగా ఒక్కో దానిలో ప్రత్యేకమయిన గుర్తింపు పొందిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. అలాగే ద్వందార్ధాలతో డైలాగులు, బూతు సినిమాలకి దర్శకుడు మారుతి సుప్రసిద్దుడని గుర్తింపు పొందారు. ఆయన తీసిన ‘ఈ రోజుల్లో, బస్ స్టాప్’ వంటి అనేక సినిమాలు అదే కోవకు చెందినవి. కానీ ఇప్పుడు ఆయన కూడా క్రమంగా సాధారణ సినిమాలు తీయడానికి మొగ్గు చూపుతున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కొత్త జంట’ సినిమాకి సెన్సార్ బోర్డు వారు యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వగా ఈసారి హీరో నానితో తీసిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమాలో ఎక్కడా ఎటువంటి వంకర మాటలు లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని సూపర్ హిట్ట్ అయింది. ఈ ఒక్క సినిమాతో దర్శకుడు మారుతి ఇండస్ట్రీలో మిగిలిన దర్శకుల చెంతన స్థానం పొందగలిగారని చెప్పవచ్చును. ఇప్పుడు చిన్నా పెద్ద హీరోలు అందరూ ఆయనతో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు.భలే భలే మగాడివోయ్ తరువాత ఆయన ‘కేరింత’ సినిమా ఫేమ్ పార్వతీశం, తేజస్విని జంటగా ‘రోజులు మారాయి’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా తీయబోతున్నారు. అది పూర్తయిన తరువాత ఆయన మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నట్లు తాజా సమాచారం. దానికి మంత్రిగారి కుటుంబ సభ్యులలో ఒకరు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ప్రకటించబడతాయి.