నాలుగేళ్ల కిందట తీసుకున్న శాంపిల్స్ టెస్టుల ఫలితాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఇప్పుడు కోర్టుకు సమర్పించింది. తరుణ్ , పూరి జగన్నాథ్ల నుంచి సేకరించిన గోళ్లు, వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్లోని 2017లోనే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపారు. తర్వాత ఆ కేసు మరుగున పడిపోయింది. ఇప్పుడు ఈడీ విచారణ ప్రారంభించడంతో మళ్లీ తెరపైకి తెచ్చారో లేకపోతే ఎందుకైనా మంచిదని తారలందరికీ క్లీన్ చిట్ ప్రకటించేద్దామని అనుకుంటున్నారో కానీ.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన రిపోర్ట్.. ఎఫ్ఎస్ఎల్ ఉన్నతాధికారి వాంగ్మూలాలను కూడా కలిపి కోర్టుకు సమర్పించారు.
ఈ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న రంగారెడ్డి జిల్లాలో కెల్విన్ను డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 2017లో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. సినీ ప్రముఖులందర్నీ వరుసగా పిలిచి పోలీసులు విచారణ దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. 2017 డిసెంబర్ నుంచి చార్జిషీట్లు వేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2018 జూలైలో.. నలుగురు సినీ సెలబ్రిటీలపై ఆధారాలు దొరికాయని.. వారి గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయన్న ప్రచరం జరిగింది. చివరికి 2019 మేలో చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో సినీ తారల పేర్లు ఎవరివీ లేవు.
ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ ఎవరి పేర్లు లేవు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లుగా కూడా వివరాలు లేవు. అంటే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ తాజాగా నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది. ఈడీ దూకుడు నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఆసక్తి రేపుతోంది.