పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజకీయం దెబ్బకు తట్టుకోలేక అవమానాలు భరించలేక ఆయన పదవీ త్యాగం చేసేశారు. ఇప్పుడు సిద్ధూకు ముఖ్యమంత్రి పదవి అధిష్టించడం తేలిక అయిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో అత్యధిక భాగం తన మద్దతుదారులుగా మార్చేసుకున్నారు. అప్పట్నుంచి అమరీందర్కు చిక్కులు తెచ్చి పెడుతున్నారు. మంత్రులు కూడా అమరీందర్ మాట వినే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి ఆయన రాజీనామా చేశారు
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే ముఖ్యమంత్రిని మారుస్తారని ఎవరూ అనుకోలేదు. అమరీందర్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పదే పదే చెబుతూ వచ్చారు. అయితే అనూహ్యంగా అమరీందర్ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి స్థాయి నేత సిద్ధూ మాత్రమే ఉన్నారు. అయితే ఆయనతో పాటు మరో ముగ్గురు , నలుగురు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి . అయితే సిద్ధూ వేరే వారికి ఇస్తే ఊరుకుంటారా అన్నది ప్రధానమైన ప్రశ్నగా ఉంది.
గతంలో బీజేపీలో ఉన్న సిద్ధూ గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కెప్టెన్తో కలిసి ఆయన ఎన్నికల పోరాటం చేశారు. కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి రేసులో సిద్ధూ కూడా నిలిచారు. అయితే తన వయసు అయిపోతోంది కాబట్టి ఇదే చివరి సారన్న ఒప్పందంతో అమరీందర్ సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత సిద్ధూ ప్రాధాన్యాన్ని తగ్గించారు. దాంతో మంత్రి పదవిని కూడా వదులుకుని ఆయన టీవీ షోలకు పరిమితయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి కాంగ్రెస్లో యాక్టివ్ అయి తను అనుకున్నది సాధిస్తున్నారు.