“ఆంధ్ర దేశం కళలు, సాహిత్యం, సంగీతంతో ప్రకాశించే సంస్కృతి సౌరభం” అని బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునకొండ ప్రాంతాన్ని గురించి వర్ణించినట్లుగా చరిత్ర చెబుతోంది. “ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సాంకేతికత, ఆతిథ్యం కలగలిసిన ఆధునిక భారత రత్నం” అని భారత మాజీ రాష్ట్రపతి డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం 2000లలో ఒక సభలో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రశంసిస్తూ చెప్పారు. నాటి నుంచి నేటి వరుకు ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలకు, మంచి తనానికి, విద్యకు కేంద్రంగానే ఉంది. అరాచకానికి, కుల గొడవలకు, మత ఘర్షణలకు ఎప్పుడూ ఆంధ్ర కేంద్రం అని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ కొన్ని రాజకీయ అరాచక శక్తులు ఆంధ్ర రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కుల, మత విభజన చేసిన తర్వాత పరిస్థితి మారింది. చివరికి అలాంటి వారు పెట్టిన చిచ్చు కారణంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో విభజనకు గురైన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత కూడా అరాచకుల బారిన పడుతూనే ఉంది. ఇప్పుడు కాస్త తెప్పరిల్లుతోంది. సునాయసంగా వచ్చే విజయాలు చరిత్రలో ఎప్పుడూ నిలబడవు. ఎంతో ఘర్షణ పడి.. పోరాడి సాధించుకున్న విజయాలకే చరిత్రలో స్థానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల పరిస్థితి ఇదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓ మహా విపత్తు నుంచి బయటపడింది. మళ్లీ పూర్వ వైభవం కోసం పోరాడుతోంది. విరిచేసిన కాళ్లను సరి చేసుకుని నడకలు ప్రారంభించింది. ఇక పరుగులు పెట్టాల్సిన సందర్భం వచ్చింది.
రౌడీ రాజకీయాల్ని ఉపేక్షిస్తే రాష్ట్రానికి అరిష్టం
తెలుగు జాతి గత రెండు దశాబ్దాలుగా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాజకీయాల కోసం ఎలాంటి కుట్రలు అమలు చేయకూడదో అలాంటి కుట్రలు అమలు చేసి అధికారంలోకి వచ్చిన వారు ఆంధ్ర భవిష్యత్ ను ఛిద్రం చేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో విభజన వాదం పుట్టుకు వచ్చింది. చివరికి తెలుగు ప్రజలు రెండుగా విడిపోయారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గాడిన పడి.. దేశంలో మరో ఉన్నతమైన రాష్ట్రంగా వెలుగొందే అవకాశం పొందినప్పటికీ.. ఏదైనా అంత తేలికగా జరిగితే దానికి విలువ ఉండదని అనుకున్నారేమో కానీ ఐదు సంవత్సరాల పాటు ఓ విధ్వంసక శక్తికి అవకాశం ఇచ్చారు. ఆ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ కళలు, సాహిత్యం, సంగీతం, విద్య , ఆతిధ్యం లాంటివన్నీ మర్చిపోయారు. అవినీతి, హత్యలు, దోపిడీలు, ఖూనీలు కబ్జాలే హైలెట్ అయ్యాయి. 2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా వార్తల్లో ఉన్నవి రాష్ట్ర ప్రయోజనాలు, విభజన హామీలు, పోలవరం, అభివృద్ధి. అదే 2019-24 మధ్య ఎప్పుడూ ఉండే వార్తలు.. నేరాలు, ఘోరాలు, దోపిడీలు, ఖూనీలు, ప్రతిపక్ష నేత అరెస్టులు, ప్రజా సామాన్య హంతక చర్యలు తప్ప.. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్కటీ హైలెట్ అయ్యేది కాదు. ఐదు సంవత్సరాల పాటు జరిగింది ఇదే. అందుకే ప్రజలు మరోసారి అలాంటి తప్పు చేయకూడదని గట్టి తీర్పు ఇచ్చారు. తాము ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసిన వారికి గట్టి బుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాలతో వాళ్లకు భవిష్యత్ లేదని తేల్చి చెప్పారు. అయితే ఇలాంటి ప్రజా తీర్పును శిరసావహించేవారు అయితే.. ఐదు సంవత్సరాల పాటు ఇంత ఘోరమైన పరిపాలన చేసేవారు కాదు. ఇప్పుడు అదే తెంపరి తనం చూపిస్తున్నారు. ఏడాదిగా వారు ప్రజల కోసం పోరాడింది లేదు. అసెంబ్లీకి వెళ్లింది లేదు. కానీ ఎక్కడికక్కడ అరాచక శక్తులకు అండగా ఉంటూ.. శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు. జగన్ రెడ్డి కార్యకర్తలను కలవడానికి వెళ్తానని అందరి బాధలను వింటానని ప్రకటించి .. వాళ్లు నిలదీస్తారని ఆగిపోయాడు. ఇప్పుడు ఎక్కడైనా శవయాత్రకు వెళ్తే.. జిల్లా మొత్తం నుంచి అసాంఘిక శక్తులను పిలిపించుకుని ప్రతీ చోటా అలజడి రేపుతున్నారు. రాప్తాడులో తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పించుకున్నారు. నిజంగా అలా చేస్తే ఆ కుట్ర చేసింది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డినే అవ్వాలి. కానీ ఆయన ఆ మాట చెప్పడంలేదు. నిన్నటికి నిన్న పొదిలికి వెళ్లి పొగాకు రైతుల కోసం మంటూ వెళ్లి చేసిన రచ్చతో ఆయన నైజం ఏమిటో బయటపడిపోయింది. ఇక ఎంత మాత్రం ఉపేక్షించినా.. అది రాష్ట్రానికి అరిష్టం అవుతుంది.
ఏడాదిలో గాడిన పడుతున్న రాష్ట్రం
ఇలాంటి విధ్వంసకుడ్ని దాటుకుని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అద్భుతమైన అడుగులు వేసింది. 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర భవిష్యత్ కోసం వేసిన పునాదులను మళ్లీ బయటకు తీసి.. వాటి మీద పునర్నిర్మాణాలను ప్రారంభించింది. ఏడాది కాలంలో శక్తిని కూడ దీసుకుని పరుగులు పెట్టేలా.. చూసుకుంటున్నారు. 2024-25లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేసిన పనులు, అమలు చేసిన పథకాలు ప్రజలకు సంతృప్తికంగా ఉన్నాయి. నెలవారీ 64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతీ నెలా రూ. 2,720 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఏడాదిలో మొత్తం రూ. 34,000 కోట్లు ఇచ్చారు. జగన్ రెడ్డి వాలంటీర్లకు ఇతర దుబారాలను ఆపేసి.. అవ్వా, తాతలకు ఇతర అభాగ్యులకు పెన్షన్లు పెంచింది ప్రభుత్వం. తల్లికి వందనం అమలు చేశారు. ఈ నెల ఇరవైన అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. పోలవరం జలాశయ నిర్మాణానికి కేంద్రం నుండి ముందస్తు నిధులు మంజూరు చేయించుకున్నారు. పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఏపీ కరువు రహితంగా మారాలంటే పోలవరం అత్యంత కీలకం. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే జోన్ ఏర్పాటు జరిగింది. ఉన్నతాధికారిని కూడా నియమించారు. భవనాల నిర్మాణం ప్రారంభమయింది. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం వేగంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో రూ. 6,33,568 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది, దీని ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. 20 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయి, ఇక ఉద్యోగ నియామకాల విషయంలోయువత ఆశలు తీర్చేలా ప్రభుత్వ పాలన సాగుతోంది. 16,347 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. ఇతర ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారు.
సైకోలకు మద్దతుతో సమాజంలో అలజడి రేపే ప్రయత్నం
ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంటే.. ఇలా అద్భుతమైన సంక్షేమం, అభివృద్ధి అలా సాగిపోతూ ఉంటాయి. కనీ ఏపీ పరిస్థితి భిన్నం. దేశంలో ఎవరూ అంచనా వేయలేని రాజకీయ కుట్రలు చేసేవారు ఇక్కడ పోటీ రాజకీయాలు చేస్తూంటారు. వారు ప్రతిపక్షం అంటే.. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడం, శాంతిభద్రతల సమస్యలను సృష్టించడం, కుట్రలు చేసి అభివృద్ధిపనులను అడ్డుకోవడం. అమరావతి పనులు జరగకూడదని వారు చేస్తున్న కుట్రలు, కుతంత్రాల గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించాలని జగన్ రెడ్డి లేనపోని శవయాత్రలు పెట్టుకుని ప్రతీ చోటా ఘర్షణలు చెలరేగేలా చేస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే పది నియోజకవర్గాల నుంచి ఐదారు వేల మందిని సేకరించాల్సిన అవసరం ఏముంది ?. అలా వచ్చిన వారు ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటున్నారు?. ఇటీవల జగన్ రెడ్డి జోగి రమేష్ ఇంట్లో కార్యక్రమానికి వెళ్లారు. ఆ సందర్భంగా కూడా రాజకీయ ర్యాలీ చేశారు. ఓ చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కుకుంటూ ఉంటే..అది టీడీపీ గుర్తు అని .. ఆ పిల్లవాడి సైకిల్ తీసుకుని విరగ్గొట్టేశారు. వారి ఉన్మాదం చూస్తే.. ఎవరికైనా భయమేస్తుంది. అలాంటి ఉన్మాదాన్ని జగన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు పెంచి పోషిస్తున్నారు. వారి నుంచి ప్రజల్ని రక్షించుకోవడం అంత తేలిక కాదు. కానీ చంద్రబాబునాయుడు ఓ మహా యజ్ఞం చేస్తున్నారు. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే .. అభివృద్ధి పనులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అమరావతితో పాటు .. పోలవరం ప్రాజెక్టును ప్రయారిటీగా తీసుకుని నిర్మిస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ కరువును తీర్చాలని అనుకుంటున్నారు.
ఆంధ్రకు పూర్వవైభవమే అందరి లక్ష్యం
ప్రతిపక్షం అంటే ప్రజలకు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకూడదు. రాజకీయాలు చేయవచ్చు కానీ అది రాష్ట్రం, ప్రజల కోణంలో మేలు చేసేలా ఉండాలి. ప్రజల్ని ఇబ్బందులు పెడితే వారు ప్రభుత్వంపై కోపంతో.. మరి ఇంకే ఆప్షన్ లేదు కాబట్టి తమకే ఓటు వేస్తారన్న రాజకీయాలు అత్యంత దుర్మార్గం. అలాంటి రాజకీయాల్ని దాటుకుని తెలుగు ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే ప్రజలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటున్నారు. ఎంతో ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్ ను .. ఫ్యాక్షనిజం, రౌడీయిజం, దోపిడీతనం కలగలసిన రాజకీయ నేతలకు మద్దతు ఇవ్వడం ద్వారా మరో బీహార్ చేసుకోకూడదన్న ఆలోచనకు వచ్చారు. అందుకే అత్యంత ఘోర పరాజయం ఇచ్చారు. ప్రజల జీవితాలను బాగు చేయాలన్న లక్ష్యంతో ఉన్న నాయకత్వానికి రాష్ట్రాన్ని మరోసారి అప్పగించారు. ఏడాదిలో ఆ మార్పేమిటో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పులోని మంచిని అలా కొనసాగించాలి. ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే ఏళ్లు పడుతుంది… అలాంటి ప్రాజెక్టులు, రాజధానులు కట్టుకోవాలంటే ఎంత ఓపిక ఉండాలి ?. ఒక్క సారి ఆగిపోయిన ఇల్లు.. ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రారంభించాలంటే రెట్టింపు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఐదు సంవత్సరాల పాటు ఒక్క చాన్స్ అంటూ వచ్చిన వారిపై జాలి చూపించినందుకు రక్తమాంసాలను త్యాగం చేయడమే కాదు.. భవిష్యత్ లో మరో పదేళ్ల పాటు వారు చేసిన తప్పులకు కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. మన పిల్లల భవిష్యత్ విషయంలో మనం రాజీ పడాల్సి వచ్చింది. ఇక ఏ రూపంలో అయినా అరాచకులకు మద్దతు ఇస్తే.. అది పెను ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది. సామాన్య ప్రజలు, మధ్యతరగతి వర్గం ఇతరులు ఇక మద్దతిచ్చే అవకాశం లేదుకాబట్టి .. పనీ పాటా లేని.. అసాంఘిక శక్తులుగా బడుగు, బలహీనవర్గాలకు చెందిన యువతను మార్చి.. వారితో తమ రాజకీయం చేసుకునేందుకు కుటిల రాజకీయం ప్రారంభించారు. అందుకే ప్రజలు వారి ట్రాప్లో పడకూడదు. వారికి ఎలాంటి మద్దతు లభించినా అది ప్రజల జీవితాలకు.. ఆంధ్రకు శాపంలా మారుతుంది.