కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారుతోంది. తన మెడకు చుట్టుకోకుండా ఉండటం కోసమో, కేసీఆర్ ను ఇరికించడం ఇష్టం లేదనో కానీ ఈటల రాజేందర్ .. అసలు తప్పే జరగలేని వాంగ్మూలం ఇచ్చారు. అన్నీ మంత్రి వర్గ నిర్ణయాల ప్రకారమే జరిగాయన్నారు. మూడు బ్యారేజీలు కట్టాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. ఎలా చూసినా.. అచ్చమైన బీఆర్ఎస్ నాయకుడు.. కేసీఆర్ అనుచరుడు ఎలా వాంగ్మూలం ఇస్తారో అలా ఇచ్చారు రాజేందర్.
ఈ వాంగ్మూలంలో ఇంకో టాపిక్ ఉంది. అదే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు మూడు బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించడం. ఆ మంత్రివర్గ ఉపసంఘంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా సభ్యుడు. అందుకే ఆయన తెరపైకి వచ్చారు. ఈటల వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఆ ఉపసంఘం.. మూడు బ్యారేజీలు నిర్మించాలని ఎలాంటి సిఫారసులు చేయలేదని స్పష్టం చేశారు. ఆ ఉపసంఘం నివేదిక ఇవ్వక ముందే.. మూడు ప్యారేజీల నిర్ణయం జరిగిపోయిందన్నారు. పసలు కాళేశ్వరంకు కేబినెట్లో అనుమతి కూడా తీసుకోలేదని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కావాలంటే తానే కాళేశ్వరం కమిషన్ కు ఓ లేఖ రాస్తానని ప్రకటించారు. వాంగ్మూలం ఇస్తానన్నారు.
బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పని చేసిన ఇద్దరూ ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. బీజేపీ ఎంపీగా ఈటల ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తుమ్మల ఉన్నారు. ఇద్దరూ భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆటల రాజేందర్ ను కేసీఆర్ అవమానకరంగా.. కుట్రలు చేసి మరీ పార్టీ నుంచి బయటకు పంపారు. తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటే ఆయనే బయటకు వెళ్లారు. అయితే ఈ వ్యవహారంలో ఇద్దరూ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ఆటల రాజేందర్ కేసీఆర్ ను రక్షించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. కానీ తుమ్మల మాత్రం విబేధిస్తున్నారు. ఆయనకు కేసీఆర్ ను టార్గెట్ చేయాలని ఉండకపోవచ్చు కానీ.. తనను ఇన్వాల్వ్ చేయడంతో తుమ్మల నిజాలు చెప్పడానికి సిద్ధమయ్యారని అనుకోవచ్చు.
కాళేశ్వరం విషయంలో కర్త, కర్మ , క్రియ కేసీఆర్ అనేది బహిరంగరహస్యం. ఆయనే ప్రాజెక్టుల రీ డిజైన్ చేశారు. ఆయనే ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్నీ ఆయన చెప్పినట్లుగా జరిగాయి. కానీ ఇతరుల పేరు మిద జరిగాయి. అదే అసలు విషయం. ఇక్కడ తుమ్మల, ఈటలల్లో ఒకరు మాత్రమే నిజం చెబుతున్నారు. అది ఎవరన్నది కూడా కాస్త అవగాహన ఉన్న వారికి ఇట్టే అర్థమైపోతుంది.