సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మేఘా గ్రూపులో ఉద్యోగంలో చేరారు. ఈవీ ట్రాన్స్ అనే కంపెనీలో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో ఆశించిన సక్సెస్ దక్కకపోవడంతో, ఆయన తిరిగి తన వృత్తిపరమైన కెరీర్పై దృష్టి సారించారు. రాజకీయాల్లో లేకపోయినా ఆయన స్వచ్చంద సంస్థ ద్వారా రైతులకు, యువతకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇటీవల ఆయన కుటుంబం సైబర్ మోసానికి గురైంది. రెండున్నర కోట్ల వరకూ నష్టపోయింది. దీంతో ఆయనకు ఆర్థిక కష్టాలు కూడా చుట్టుముట్టినట్లుగా కనిపిస్తోంది. చివరికి ఆయన ఉద్యోగాన్ని ఎంచుకున్నారు.
సీబీఐ జేడీగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసీ మైనింగ్ కేసులను అత్యంత పకడ్బందీగా డీల్ చేసి లక్ష్మీనారాయణ వార్తల్లో నిలిచారు. చివరికి లంచాలు తీసుకుంటున్న జడ్జిలను కూడా పట్టుకుని వ్యవస్థలో తన నిజాయితీని చాటుకున్నారు. అనంతరం మహారాష్ట్ర కేడర్కు వెళ్లిన ఆయన, పదవీకాలం ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి మళ్లీ వెళ్తున్నారనే సాకుతో ఆ పార్టీకి దూరమయ్యారు.
రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం ప్రయత్నించిన లక్ష్మీనారాయణ, క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణను ఓట్లుగా మలచుకోవడంలో విఫలమయ్యారు. 2024 ఎన్నికల ముందు ఆయన జై భారత్ నేషనల్ పార్టీ ని స్థాపించి, విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. కనీసం ఐదు వేల ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్ కోల్పోయారు. చివరికి ఆయన వీటన్నింటినీ వదిలేసి మళ్లీ ఉద్యోగానికి వెళ్తున్నారు.