తెలుగుదేశం పార్టీ నుంచి తెరాసలో చేరిన 12మంది తెదేపా ఎమ్మెల్యేలపై మూడు నెలలోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఈరోజు తెలంగాణా శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని ఆదేశించింది. ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యర్ధన మేరకు తెదేపాని తెరాసలో విలీనం చేస్తున్నట్లు తెలంగాణా అసెంబ్లీ కార్యదర్శి ఈ ఏడాది మార్చి 10వ తేదీన జారీ చేసిన బులెటిన్ పై కూడా స్టే విదించింది.
తెరాసలో చేరిన తెదేపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెదేపా ఇచ్చిన వినతి పత్రాలని స్పీకర్ మధుసూదనాచారి పట్టించుకోలేదు. కానీ తెదేపాని తెరాసలో విలీనం చేయమని కోరుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు వ్రాసిన లేఖపై స్పీకర్ తక్షణమే ఆమోదించారు. ఆ విషయం సభ్యులందరికీ తెలియజేయడం కోసం మార్చి 10న తెలంగాణా అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ జారీ చేశారు.
అదే విషయాన్ని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళగా, న్యాయస్థానం ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ, పార్టీ ఫిరాయించిన 12మంది తెదేపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోమని స్పీకర్ ని ఆదేశించింది. స్పీకర్ పరిధిలో ఉన్న ఆ వ్యవహారంలో న్యాయస్థానాలకి జోక్యం చేసుకొనే అధికారం లేదు కనుక ఆయన వాటిని పట్టించుకోకపోవచ్చు. కనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు కానీ ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతారు అంతే.
ఈ తీర్పు ఒక్క తెలంగాణా ప్రభుత్వానికి మాత్రమే కాదు..20 మంది వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి ఫిరాయించిన తెదేపా ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. కానీ తెలంగాణా ప్రభుత్వమే దానిని పట్టించుకొనే అవకాశాలు లేనప్పుడు తెదేపా ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకొంటుంది?