దోచుకెళ్లలేని సొత్తు… విజ్ఞానమే అంటారు పెద్దలు. కానీ చిత్రసీమలో ఆ మాటకీ బూజు పట్టుకుపోయింది. అక్షరాన్ని నమ్ముకొని వచ్చినోళ్లు కొంతమందైతే వాళ్లని నమ్మించి… అదే అక్షరాన్ని అమ్మేసేవాళ్లు ఇంకొంతమంది. టాలీవుడ్లో ఘోస్ట్ రైటర్ల దుస్థితి చూస్తుంటే…. సరస్వతీ చౌర్యం ఇక్కడ ఎంత నిసిగ్గుగా జరుగుతోందో అర్థమవుతోంది. రచయితగా పేరు తెచ్చుకోవాలి, త్రివిక్రమ్ స్థాయిలో ఓ బ్రాండ్ సంపాదించాలని అని కోటి ఆశలతో టాలీవుడ్లో కి అడుగుపెడుతున్న యువ రచయితల్ని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు కొంతమంది దర్శకులు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అనే కార్డుపై ఉన్న మోజుతో మరొకరి ప్రతిభను, మరొకరి కష్టాన్నీ దోచుకొంటున్నారు. చిత్రసీమలో ఘోస్ట్ రైటర్ల కష్టాలు ఎప్పుడూ ఉండేవే.కానీ… ఈమధ్య మాత్రం అవి మితిమీరిపోతున్నాయి. పైకి చెప్పుకోలేక, ఇంకో మార్గం లేక… ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఓరోజు తమకంటూ ఓ గొప్ప అవకాశం వస్తుందని ఆశపడి.. నిరీక్షించి.. విసిగి వేసారిపోయి మౌనంగా రోదిస్తున్నవాళ్లు ఎంతోమంది.
ఇది వరకు ఓ కథ పుడితే దానికి మాటలతో ప్రాణ ప్రతిష్ట చేసి, తుదిమెరుగులు దిద్దేంత వరకూ ఒక్కడే రచయిత పనిచేసేవాడు. పేరూ, ఖ్యాతి, డబ్బు ఆయనకే దక్కేది. ఒక విధంగా రచయితలకు అదే స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఇప్పుడు ట్రెండ్ మారింది. రచయిత అనేవాడు ఆల్మోస్ట్ కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. దర్శకుడే రచయిత క్రెడిట్నీ తన ఖాతాలో వేసుకోవడానికి ఉబలాట పడుతున్నాడు. ఇప్పుడు కథ, మాటలు రాసేది ఒక్క కాదు. దానికో గుంపు ఉంటుంది. స్టోరీ డిస్కర్షన్ పేరుతో పదిమందిని ఓచోట కూర్చోబెట్టి.. వాళ్ల ఐడియాలన్నీ కలిపి కుట్టేయడమే దర్శకత్వం. ఓ సినిమాలో పది మాటలు బాగా పేలాయంటే.. క్రెడిట్ ఎవ్వరికి ఇవ్వాలో అర్థం కాదు. ఎందుకంటే ఆ పది మాటల వెనుక వంద మంది ఉంటారు. కొంతమంది బడా రచయితలకు సెపరేట్ గా ఓ గ్యాంగ్ ఉంటుంది. వాళ్ల దగ్గర ఏడెనిమిదిమంది జూనియర్లు పనిచేస్తుంటారు. నిజానికి వాళ్లే పనిచేస్తారు. ఈ బడా రచయిత మాత్రం కరెక్షన్లు చేస్తాడు. జూనియర్లకు జీతం పడేసి.. క్రెడిట్ తాను కొట్టేస్తుంటాడు. ఇటీవల ఓ అగ్ర హీరో సినిమా మొదలైంది. దానికి నలుగురు రచయితలు పనిచేస్తున్నారు. ఈ నలుగురినీ పర్యవేక్షించేది ఓ బడా రైటరు. ఆయన రాసేదేం ఉండదు. జస్ట్ పర్యవేక్షిస్తా రంతే. కానీ టైటిల్ కార్డులో రచయితగా పేరు మాత్రం ఆయనదే పడబోతోంది.
ఆమధ్య ఓ దర్శకుడు, రచయిత కొట్టుకొనే స్థాయికి వెళ్లారు. దానికి కారణం ఈగో సమస్యలే. రచయిత దగ్గర ఎనిమిదిమంది జూనియర్లున్నారు. ఆయన రాసిందేం ఉండదు. టైటిల్ కార్డులో మాత్రం తన పేరు రావాలని పట్టుపట్టాడు. ఆ దర్శకుడు ఇంకా మొండోడు. నువ్వు రాసిందేం లేదు కదా, అందుకే మాటల క్రెడిట్ కూడా నేనే తీసుకొంటా అని కథ, మాటలు, దర్శకత్వం కింద తన పేరు వేసుకొన్నాడు. దాంతో పెద్ద రాద్దాంతం జరిగింది. ఇద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకొన్నారు. ఆ తరవాత సినిమాటిక్గా కలుసుకొన్నారు. అంతెందుకు…. బాహుబలి సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. చరిత్ర సృష్టించింది. అందరూ ప్రభాస్, రాజమౌళిల గురించో… చిన్న వేషం వేసిన ప్రభాకర్ గురించో మాట్లాడుకొంటున్నారు గానీ ఆ సినిమాకు మాటలు అందించిన రచయితల గురించి పట్టించుకోవడం లేదు. అదీ మన ఖర్మ. రచయితల పొట్ట కొట్టొద్దు… సేవ్ రైటర్స్ అంటూ డైమండ్ రత్నం లాంటి రచయితలు గొంతు చించుకొని ఘోషిస్తున్నా పట్టించుకొనే నాధుడు లేడు.
ఈ అరాచకాలు భరించలేకే రచయితలు చాలామంది దర్శకులుగా అవతారం ఎత్తుతున్నారు. తమకున్న ప్రతిభను ప్రపంచానికి చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ అప్పటికే సదరు రచయిత పులుసు మరో దర్శకుడు పిండేసి ఉంటాడు. అందుకే.. దర్శకత్వం అంటూ కెప్టెన్ కుర్చీలో కూర్చునేటప్పటికి కేవలం ఉత్తి పిప్పి మిగులుతుంది. పిదప దర్శకులుగానూ రాణించక.. కనుమరుగవుతున్నారు. భవిష్యత్తులో దర్శక రచయితలే ఉంటారు తప్ప.. రచయితలంటూ ప్రత్యేకంగా ఉండరేమో అన్నంత భయం వేస్తోంది పరిస్థితి చూస్తుంటే. ఈ దుస్థితి మారాలంటే దర్శకుల దృక్పథంలో మార్పు రావాలి. రచయితని గౌరవించాలి, వాళ్ల అక్షరాలకు విలువ ఇవ్వాలి అనుకోవాలి. అప్పుడే రచయితలకు మనుగడ ఉంటుంది.