టాలీవుడ్ లో ఇప్పటి వరకూ కధలదో, కథానాయికలదో కొరత ఉందనుకున్నాం. అయితే చాపకింద నీరులా దర్శకుల కొరత కూడా పాకేసింది. ఇది వరకు కథలు పట్టుకుని హీరోల చుట్టూ తిరిగేవారు దర్శకులు. ఇప్పుడు ఈ సీన్ మారింది. కథలంటే చెప్పానని హీరోలే దర్శకులకు ఫోన్లు చేస్తున్నారు. లేదంటే ఓ కథ రెడీ చేసుకుని దాన్ని డీల్ చెయ్యగల కెపాసిటీ వున్న దర్శకుల చేతిలో పెడుతున్నారు. దాసరి నారాయణరావు కూడా పవన్ కళ్యాణ్ కోసం ఓ దర్శకుడిని అన్వేషిస్తున్నారు. రెండేళ్ల నుంచి అదే ప్రయత్నం లో వున్నారాయన. పవన్ కి సరిపడే కథ దొరక్క ఏడాది వేస్ట్ అయిపొయింది. ఇప్పుడు పవన్ కోసం ఓ లైన్ రెడీ చేశారు. దాన్ని డీల్ చెయ్యగల దర్శకుడి వేటలో వున్నారాయన.
బోస్ – ది సన్ అఫ్ ఇండియా అనే పేరుని ఇటీవల దాసరి తన సొంత నిర్మాణ సంస్థ లో రిజిస్టర్ చేశారు. ఈ స్క్రిప్ట్ బోయపాటి శీను చేతిలో పెట్టాలన్నది దాసరి ఆలోచన. దీనికి సంబంధించి బోయపాటి తో సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే బోయపాటి ఈ ఆఫర్ ని సున్నితం గా తిరస్కరించినట్టు టాక్. మరొకరి కథ ని డీల్ చెయ్యడం తనకు కష్టం అవుతుందని, పవన్ కి సరిపోయే సబ్జెక్టు తన దగ్గర ఉందని, కావాలంటే దానితో ప్రొసీడ్ అవుతానని అన్నాడట. అయితే బోస్ కథ పై మనసుపడిన దాసరి బోయపాటి కండీషన్ కి ఒప్పుకోలేదని సమాచారం. దాసరికి దర్శకుడు దొరికినా త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యేవరకు వెయిటింగ్ లో ఉండాల్సిందే. అందుకే దాసరి కూడా ఏమాత్రం తొందరపడటం లేదట. ఈ లోగా బోయపాటి మనసు మారొచ్చని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.