ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అటూ, ఇటూ వున్న విజయవాడ, గుంటూరు నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యవహారాలు స్తంభించిపోయాయి…చతికిలపడ్డాయి. రాజధాని నిర్మాణంలో వున్న ప్రాంతంలో సహజంగానే భూముల విలువ పెరుగుతుంది. దీనికితోడు రాష్ట్రప్రభుత్వం రాజధానికి ఇచ్చిన హైప్ వల్ల పెరిగిన రియల్ ఎస్టేట్ బూమ్ అంతా ఇంతా కాదు.
విజయవాడ రాజధాని కావచ్చు అనే స్పెక్యులేషన్ తో అప్పట్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాలు కొని వెంచర్లు చేశారు. బిల్డర్లు కూడా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అపార్ట్మెంట్లు నిర్మించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టారు.
విజయవాడ రాజధాని కాకపోయినా రాజధాని పక్కనే వున్న పెద్ద నగరం కావడం వల్ల విజయవాడకు ఉద్యోగులు, వ్యాపారులు తరలి వస్తుండడంతో.. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుందని అంచనాలు వేశారు. ఇందువల్ల కూడా రియల్టర్లు, బిల్డర్లు.. బెజవాడలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టారు. ఆ అంచనాల ప్రకారమే నగరానికి వచ్చే జనం బాగా పెరుగుతున్నారు.
అయితే, రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నవారి సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ఇక్కడికి వస్తున్న జనానికి, ఆదాయ వనరులు, అప్పు తెచ్చుకునే సదుపాయాలు రియల్ ఎస్టేట్ మార్కెట్ కి మాచ్ కాకపోవడమే ఇందుకు మూలం. దీంతో తమ స్థాయికి తగ్గట్లుగా అద్దె ఇళ్లల్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఫలితంగా అమ్మకాలు ఆగిపోయి రియల్ ఎస్టేట్ రంగం చతికిలపడిపోయింది. విజయవాడ వద్ద దాదాపు 30 వెంచర్లు, గుంటూరు వద్ద 18 వెంచర్లలో ఎలాంటి క్రయవిక్రయాలు లేవు. పెట్టుబడులపై వడ్డీలు పెరిగి రియల్టర్లు అప్పుల్లో మునిగిపోతున్నారు. వీరిలో గత ఆరునెలల కాలంలో విజయవాడలో ముగ్గురు గుంటూరులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.
మరోవైపు విజయవాడలో అపార్ట్మెంట్ల ధరలు ఆకాశన్నంటాయి. కరెన్సీనగర్, రామవరప్పడురోడ్డులో చదరపు అడుగుకు 3500 నుంచి 4000 వరకు, మారుతినగర్లో 6500 వరకు, మొఘల్ రాజపురం, లబ్బీపేటలో 7000 నుంచి 7500 వరకు ధరలు ఉన్నాయి.
స్థలాలధర ఆయా ప్రాంతాలను బట్టి చదరపు గజం 70 వేల రూపాయల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ఉన్నాయి. సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో లేకపోవడం వల్లే రియల్ వ్యాపారం పుంజుకోవడం లేదన్న భావన వ్యక్తమవుతోంది.
విజయవాడ చుట్టూ వున్న వెంచర్లు తోపాటు వందల ఎకరాల ఖాళీ స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఎకరం కోటి రూపాయల నుంచి పది కోట్ల వరకు వెచ్చించి కొందరు భూముల్ని కొనుగోలు చేశారు. వెంచర్లు వేసినా సరైన డిమాండ్ లేక.. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం వస్తే చాలన్న పరిస్థితికి వచ్చారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.
భూమిధరను మార్కెట్ ఫోర్సులే నిర్ణయిస్తాయి. నిర్మాణరంగంలో ఖర్చులు తగ్గడం వల్ల మాత్రమే రియల్ ఎస్టేట్ రంగంలో ఏక్టివిటీ పెరుగుతుంది. ఉత్పత్తి పెరగడం వల్ల, పోటీ పెరగడం వల్ల, సుంకాలు, పన్నులు తగ్గించడం వల్ల సిమెంటు, ఇనుము, ఇతర బిల్డింగ్ మెటీరియల్ ధరలు తగ్గుతాయి. ఆధోరణే ‘రియల్’ ఎక్టివిటీని పెంచుతుంది!