క్రైమ్: కూతుర్ని చంపారు.. కాల్చారు..అస్థికలను కాల్వలో వేశారు..! పరువు కోసమే..!!

ప్రేమే నేరం..! ఆ నేరానికి కన్న వాళ్ల చేతుల్లో మరణశిక్ష..! చనిపోయిన తర్వాత కూడా మోక్షం లేకుండా.. రాకుండా బూడిద, అస్థికలను కాల్వలో పడేయడం.. ఎవరూ వేయనంత శిక్ష…! దీన్ని వేసింది.. అచ్చంగా తల్లిదండ్రులు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ప్రేమించి .. పెళ్లి చేసుకున్న పాపానికి రక్తం పంచుకు పుట్టిన కూతురికి ఆ తల్లిదండ్రులు వేసిన ఘోరమైన శిక్ష ఇదే. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘటన ఇది.

మంచిర్యాల జిల్లా లో జిన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన పిండి అనురాధది యాదవ సామాజికవర్గం. ఆమె హైదరాబాద్ లో చదవుకుంటోంది. అదే గ్రామానికి చెందిన అయ్యోరు లక్ష్మణ్‌ అనే యువకుడ్ని ప్రేమించింది. అతను కూడా హైదరాబాద్ లోనే చదువుకుంటున్నాయి. అయితే.. లక్ష్మణ్ పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన యువకుడు. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో… ఈనెల 3న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అనూరాధ కుటుబంసభ్యులు దాడి చేస్తారన్న భయంతో… శనివారం జిన్నారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి.. రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసుల ముదు సైలెంట్‌గా వ్యవహరించిన వారు.. బయటకు అడుగు పెట్టిన తర్వాత నిజస్వరూపం చూపించారు.

అనూరాధ భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్లగానే వారింటిపై దాడికి దిగారు. జనం చూస్తుండగానే అనురాధను కర్రలతో కొట్టుకుంటూ తమ ఇంటికి తీసుకెళ్లారు. మల్లాపూర్‌ అనే గ్రామ శివారులోని గట్టుపైకి తీసుకెళ్లి కొట్టి చంపారు. అక్కడే మృతదేహాన్ని కాల్చేశారు. అస్థికలు, బూడిదను పక్కనే ఉన్న కాలువలో పోశారు. దహనం చేసిన చోట సాక్ష్యాలు కనిపించకుండా పేడతో అలికి వెళ్లిపోయారు. తర్వాత విషయం బయటకు వచ్చింది. దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహానీ ఉందని.. అనూరాధ ముందే గ్రహించింది. ఇద్దరిలో ఎవరికైనా ముప్పువాటిల్లినా తన సాక్ష్యంగా అంటూ.. ఓ వీడియోను ముందే రికార్డు చేసింది. దాన్ని స్నేహితులకు షేర్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.