తెలంగాణ జాగృతి పేరుతో సొంత రాజకీయాలు చేస్తున్న కవిత బనకచర్ల ప్రాజెక్టు గురించి అందరూ గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఆమె తీరు చూస్తూంటే రేపు ఏపీ మీద పడి రాజకీయం చేసే వ్యూహంలో బనకచర్లనే హైలెట్ చేసేలా ఉన్నారు. ఈటల రాజేందర్ ను మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు బనకచర్ల కట్టేస్తున్నారని రచ్చ చేస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. రెండురాష్ట్రాల మధ్య ద్వేషాలు పెంచి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారు. కానీ బనకచర్లను ఏపీ నిర్మిస్తే దాని వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుందో మాత్రం చెప్పడం లేదు.
బనకచర్ల సముద్రంలోకి పోయే నీటిని ఎత్తిపోసుకునే ప్రాజెక్టు
శ్రీశైలం, సాగర్ వంటి ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని కేటాయింపుల ఆధారంగా విడుదల చేసుకుంటూ ఉంటారు. ఈ రెండింటి నుంచి నీటిని తరలించుకునే ప్రాజెక్టులు నిర్మించుకోవాలంటే అనుమతులు తీసుకోవాలి. కానీ ఎక్కడా నిల్వ ఉండని. వరదలు వచ్చినప్పుడు సముద్రంలోకి పోయే నీటిని మళ్లించుకునేందుకు బనకచర్ల నిర్మిస్తున్నారు. గోదావరికి ప్రతి ఏడాది వచ్చే వరదల వల్ల వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. అత్యంత దిగువ రాష్ట్రంగా ఆ నీటి వృధాను ఏపీ కళ్లారా చూస్తోంది. వాటిని పొలాలకు మళ్లించుకోవాలనే ఆలోచన చేస్తుంది. ఒక వేల అలా చేయకపోతే సముద్రంలోకి పోతాయి కానీ తెలంగాణలోకి కాదు.
ఏపీ ఎత్తిపోసుకోకపోతే పోయేది సముద్రంలోకే.. తెలంగాణలోకి కాదు !
గోదావరి, కృష్ణా జలాల కేటాయింపుల విషయంలో వివాదాలు ఉండవచ్చు కానీ ఇప్పటికీ అమల్లో ఉన్న ఒప్పందాలు ఉన్నాయి. ఆ ప్రకారం కేటాయింపులు జరుగుతున్నాయి. వాడుకుంటున్నారు. బనకచర్లను నిర్మిస్తే తెలంగాణకు కేటాయించిన నీటి నుంచి ఒక్క చుక్క కూడాతీసుకోలేరు. గోదావరిపైనే లక్ష కోట్లను పెట్టి కాళేశ్వరం తెలంగాణ నిర్మించుకుంది. అయినా వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. అది ఎగువన కట్టారు. అంటే వారు ఎత్తిపోసుకోగలిగినంత ఎత్తిపోసుకున్న తర్వాతనే దిగువకు వస్తాయి. అంటే ఏపీకి వస్తాయి. మరి ఆ వరద నీటిని ఏపీ వాడుకుంటే ఎందుకు వివాదం చేస్తున్నారు?. ఇంకా ఎంతో నీరు వృధాగా పోతోందని.. ఇంకా ప్రాజెక్టులు కట్టుకోవాలని దిగువ రాష్ట్రం ఏపీ ఆఫర్ ఇస్తోంది కూడా.
ద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది !
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తెలంగాణ వాదానికి బలం పెంచుకోగలిగారు. కానీ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎవరు రెచ్చగొడుతున్నారు.. ఎవరు రాజకీయం చేస్తున్నారో అందరికీ అర్థమైపోతుంది. దిగువ రాష్ట్రమైన ఏపీని ఇప్పటికీ బూచిగా చూపించి రాజకీయాలు చేయాలనుకుంటే .. మళ్లీ ప్రాణాలు అర్పించడానికి.. ప్రజలు సిద్ధంగా ఉండరు. రెచ్చగొట్టే రాజకీయాలపై ఇప్పటికీ స్పష్టత ప్రజలకు వచ్చింది. దిగువ రాష్ట్రమైన ఏపీ.. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నీటిని లాక్కుంటుందని ప్రచారం చేస్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు ?. బనకచర్ల తో సముద్రంలోకి పోయే నీళ్లను ఏపీ ఎత్తి పోసుకుంటే.. తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుందో ఒక్కరంటే ఒక్కరైనా ఎందుకు చెప్పడం లేదు ??