కత్తి వివాదానికి తెర: ఎలా జరిగిందసలు? (part-2)

నాలుగు నెలలుగా నలుగుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్- కత్తి మహేష్ వివాదానికి తెర పడింది. మహాన్యూస్ లో కత్తి మహేష్, కళ్యాణ్ దిలీప్, శేఖర్ ల సమక్షం లో జరిగిన డిబేట్ లో “సొల్యూషన్” దిశగా అడుగులు పడ్డాయి. అయితే తెర ముందు జరిగిన వ్యవహారం తో పాటు తెర వెనుక తీవ్రమైన కసరత్తే జరిగినట్టు తెలుస్తోంది. నాలుగు నెలలుగా ఈ వ్యవహరం నలుగుతున్నప్పటికీ అప్పుడది సోషల్ మీడియాకే పరిమితమైన వ్యవహారం. కానీ ఎప్పుడైతే టివి9 కి ఎక్కిందో అప్పటినుంచే సమస్య తీవ్రరూపం దాల్చింది. దీని వెనుక ఏదో కుట్ర ఉండిఉండవచ్చంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంత జరుగుతూంటే, పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానీ ఎందుకు దీన్ని పరిష్కరించుకోలేకపోతున్నారంటూ చర్చలు మొదలయ్యాయి. అయితే ఉన్నట్టుండి, సడెన్ గా సయోధ్య జరిగిపోయింది. తెర వెనుక ఏం జరిగింది మరి. అది చూసే ముందు ఇక్కడ కొన్ని సంఘటనల క్రమాన్ని మనం గమనించవచ్చు.

  • కోన వెంకట్ 15 వ తేదీ వరకు సంయనం పాటించమని గడువు కోరడం.
  • కత్తి మహేష్ తో బాగా అనుబంధం ఉన్న తమ్మారెడ్డి తన స్వంత యూట్యూబ్ ఛానెల్ లో కత్తి మహేష్ ని అడ్డం పెట్టుకుని ఛానెళ్ళు తేర గా సంపాదించుకుంటున్నాయి కానీ కత్తి కి దీనివల్ల ఒరిగిందేమీ లేదని, పైసా ప్రయోజనం కూడా కత్తి కి దీనివల్ల జరగలేదని చెప్పటం. అలాగే ఏదోలా ముగింపు పలకాలని కత్తి కి తానే పలు మార్లు సూచించడం.
  • సినీ నిర్మాత రాంకీ, కత్తి మహేష్ మీద ప్రయోగించడానికి తనదగ్గర రామబాణం ఉందని చెప్పడం, ఆ తర్వాత కత్తి మహేష్ అమ్మాయిలకి పంపిన అసభ్యమైన వాట్సప్ మెసేజ్ లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం.
  • వాట్సప్ మెసేజ్ లేకాదు, మరిన్ని ప్రూఫ్ లు ఉన్నాయంటూ, కత్తి మహేష్ పై కేసులు పెట్టొచ్చంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం.
  • సినీ నిర్మాత రాంకీ, ఛానెల్ డిబేట్ లలో కత్తి మహేష్ కి లైఫ్ థ్రెట్ ఉందనీ, పవన్ కి సంబంధం లేని వారు ఆయన లైఫ్ మీద అటెంప్ట్ చెసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ఫ్యాన్స్ మీదకి వెళ్తుంది కాబట్టి దీన్ని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందని పదే పదే కత్తి మహేష్ కి బ్రెయిన్ వాష్ చేయడం.
  • ఛానెల్ డిబేట్ లో పాల్గొనే క్రమం లో కత్తి మహేష్ తో కాస్త చనువు పెరిగి కళ్యాణ్ దిలీప్ విడిగా ఏకాంత చర్చలు జరపడం.
  • జనసేన నుంచి అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసి, వెనక్కి తగ్గడానికి కత్తి మహేష్ కి కూడా ఒక గౌరవప్రదమైన మార్గం (ఎస్కేప్ రూట్) ప్రిపేర్ చేయడం.
  • టివి1 లైవ్ లో కళ్యాణ్ దిలీప్ స్వయంగా నాగబాబు స్థాయి వ్యక్తి కత్తి మహేష్ తో చర్చలు జరిపారని ప్రకటించడం.
  • వీటన్నింటి కంటే ముఖ్యంగా కత్తి మహేష్ ఇష్యూ పరిష్కారం అయిన కొద్ది నిముషాలకే పవన్ రాజకీయ యాత్ర కి సంబంధించిన ప్రకటన రావడం.

కత్తి మహేష్ మహా న్యూస్ లైవ్ లో మెత్తబడ్డాక, కేసులు వాపస్ తీసుకున్నాక టివి9 అనుబంధ ఛానెల్ అయిన టివి1 లో డిబేట్ జరిగింది. ఆ టివి1 యాంకర్ ఏమో కత్తిని సూటిగా అడుగుతాడు – “మీతో రాం చరణ్ మాట్లాడారా, నాగబాబు మాట్లాడారా, ఎవరు మీతో డీల్ సెట్ చేసారో బయటికి చెప్పగలరా ” అంటూ. ఆ తర్వాత టివి9 లో మళ్ళీ ఇదే డిబేట్ జరిగితే టివి9 రజనీకాంత్ అడుగుతాడు – ” ఏ మగాడైనా లొంగేది రెండింటికే, ఒకటి డబ్బు, రెండు అమ్మాయిలు. ఇక్కడ కత్తి మహేష్ విషయం లో డబ్బు పాత్ర ఏమైనా ఉందా? లేక ఎవరైనా బెదిరించారా” అంటూ. ఊహించినట్టుగానే, కత్తి మహేష్ తానెవరి నుంచీ డబ్బు తీసుకోలేదనీ, తననెవరూ బెదిరించలేదనీ సమాధానమిచ్చాడు. అయితే ఈ రెండు డిబేట్లు, నాగబాబు స్థాయి వ్యక్తులెవరో కత్తి మహేష్ తో నేరుగా మాట్లాడి ఉండొచ్చనీ, దాంతోనే కత్తి మహేష్ మెత్తబడి ఉండొచ్చనే అభిప్రాయాన్ని క్రియేట్ చేసాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం “మూర్తి తో లైవ్ ” ప్రోగ్రాం జరుగుతున్న సమయం లో నే కళ్యాణ్ దిలీప్ చొరవతో మెగా ఫ్యామిలీ కి సంబంధించిన వ్యక్తి మహేష్ తో మాట్లాడారని తెలుస్తోంది. అయితే అది నాగ బాబా,లేక రాం చరణా లేక మరొకరా అన్నది బయటికి రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కానీ ఆ డిస్కషన్ తర్వాతే కత్తి కాస్త మెత్తబడ్డట్టు తెలుస్తోంది. ఈ సమాచారం ఉండటం వల్లే ఛానెళ్ళన్నీ “మీతో డీల్ సెట్ చేసింది ఎవరు” అని గుచ్చి గుచ్చి అడిగారు. ఇక టివి1 అయితే ఒకడుగు ముందుకు వేసి మీకు జనసేన టికెట్ ఆఫర్ చేసారని అంటున్నారు, దీనికి మీరేమంటారు అని అడిగింది.

ఇక మరొక వైపు నుంచి – కత్తి కి సంబంధించిన అసభ్య వీడియోలు కూడా పవన్ ఫ్యాన్స్ కి సంబంధించినవారికి చేరినట్టు తెలుస్తోంది. వీడియోల ఆధారంగా కత్తి మహేష్ ని బెదిరించకపోయినప్పటికీ, కత్తి మహేష్ ఇలాంటివాటికి బెదిరే రకం కాదని తమకి తెలుసని అంటూనే తమ దగ్గరకి ఆ వీడియోలు చేరిన విషయం కత్తి కి “కన్వే” చేసారు. అలాగే మరిక వైపు – ఈ మొత్తం వ్యవహారం వల్ల కత్తి మహేష్ కి ఒరుగుతున్నది ఏమీ లేదని, కొత్త శత్రువులు తయారవుతున్నారని, సిట్యుయేషన్ “అవుటాఫ్ కంట్రోల్” వెళ్తోందని, కళ్యాణ్ దిలీప్ తదితరులు కత్తి మహేష్ తో విడిగా భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. ఒక పాయింట్ వద్ద కత్తి మెత్తబడ్డట్టు కనిపించాకే, మెగా ఫ్యామిలీ కి సంబంధించిన వ్యక్తి తో మాట్లాడింపజేసి, పూర్తిగా శాంతింపజేసినట్టు తెలుస్తోంది.

అయితే కత్తి కి ఏమని హామీ ఇచ్చారన్న విషయం మీద ఇప్పటికైతే స్పష్టత లేదు. టివి9 రజనీకాంత్ కత్తి మహేష్ ని “మీకు ఏ హామీ లభించిందని” గుచ్చి గుచ్చి అడిగినా కత్తి బయటపడకపోయేసరికి, రూటు మార్చి, “మీ భవిష్యత్తు సినీ పరిశ్రమ లో ఉండనుందా, రాజకీయాల్లోనా ?” అని అడిగితే కత్తి మహేష్ తనకి రాజకీయాలపైనే ఆసక్తి ఉన్నట్టు చెప్పేసాడు.
ఒకవేళ మెగా ఫ్యామిలీ నుంచో, జనసేన నుంచో కత్తి కి ఏదైనా “మాటిచ్చి” ఉన్నట్టయితే, అది తొందరలోనే బయటపడకపోదు. కానీ ఇప్పటికైతే ఆ హామీ గురించిన వివరాలు (ఒక వేళ అలాంటిదేదైనా ఉంటే) ఎవరికీ తెలీట్లేదు.

ఇవన్నీ చూస్తే, కత్తి మహేష్ వ్యవహారం పవన్ ఫ్యాన్స్ కే కాదు, జనసేన ట్రబుల్ షూటర్స్ (if any) కి కూడ కంటిమీద కునుకు లేకుండా చేసిందన్నది వాస్తవం. అందుచేతనే రకరకాల మార్గాలు అన్వెషించి – సామ దాన భేదోపాయాలు ఉపయోగించినట్టు అర్థమవుతోంది. అయితే ఆ సామ దాన భేదోపాయాలకి కత్తి మహేష్ లొంగాడా లేక, నాలుగు నెలలుగా తనని వేధిస్తున్న ఈ సమస్యకి పరిష్కారం త్వరగా దొరికితే బాగుండన్న ఒక అలసిపోయిన స్థాయి కి వచ్చిన టైం లో జనసేన, పవన్ ఫ్యాన్స్ నుండి ఒక సానుకూల చర్చ మొదలవడం తో తనవైపు నుండి కూడా ఒక మెట్టు దిగాడా అనేది – ఎవరికి వారు అర్థం చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది. ఏది ఏమైనా, కత్తి మహేష్ మాత్రం జనసేన విజయవంతం కావాలనీ, పవన్ సిఎం కావాలనీ ఆకాక్షించడం ఇక్కడ కొసమెరుపు!!

అయితే ఇదంతా ఒకెత్తు అయితే, కత్తి మహేష్ సయోధ్య కి ఒప్పుకున్నాడని తెలియగానే కొన్ని ఛానెళ్ళలో ఒక పందేరం మొదలైంది. ఒకట్రెండు ఛానెళ్ళు ప్రవర్తించిన తీరు “ఆల్మోస్ట్” విస్తుగొలిపేలా ఉంది. ఆ పందేరం పై – పార్ట్3 లో

-ZURAN

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.