ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పినప్పటికీ , ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగాయి. బుల్లెట్లు, క్షిపణి దాడులు లేవు. కాల్పుల విరమణను కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
మరోసారి సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. మే29న జమ్మూ కాశ్మీర్ , పంజాబ్ , రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాక్ ఉగ్రవాదులు పీవోకేలోకి తిరిగి చేరుకుంటున్నారని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శశాంక్ ఆనంద్ ప్రకటించిన మరుసటి రోజే మాక్ డ్రిల్ పై కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఆపరేషన్ సింధూర్ కు ముందు మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించింది కేంద్రం. సరిగ్గా 6వ తేదీ అర్ధరాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే), పాకిస్థాన్ లలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది.
ఇప్పుడు మే29న మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో మరోసారి పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేస్తుందా? అని చర్చ జరుగుతోంది. కేంద్రం జారీ చేసిన ఈ తాజా ఆదేశాలతో సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను పెంచారు.