యూరిలో జరిగిన ఉగ్రవాదుల దాడులలో 17మంది సైనికులు మరణించడంతో దేశ ప్రజలలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈసారి పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని అందరూ కోరుకొంటున్నారు. కానీ ఆవేశంలో పాకిస్తాన్ తో యుద్దానికి దిగితే ఏమవుతుందో కూడా అందరికీ తెలుసు. అందుకే ఎంత ఆగ్రహం ఉన్నా దానిని అదుముకొని దౌత్య పద్దతులలోనే పాకిస్తాన్ ఆగడాలకి చెక్ పెట్టాలని మోడీ ప్రభుత్వం నిశ్చయించుకొంది. పాక్ ఉగ్రవాద దేశమని నిరూపించే ఆధారాలు అంతర్జాతీయ సమాజం ముందుంచి, వాటి చేత పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని ప్రకటింపజేయాలని భారత్ నిర్ణయించుకొంది. కానీ అటువంటి ప్రయత్నాలు ఎన్నడూ ఫలించిన దాఖలాలు లేవు.
గత మూడున్నర దశాబ్దాలుగా భారత్ పై పాక్ పరోక్షయుద్ధం చేస్తూనే ఉంది. ప్రపంచ దేశాలు సైతం ఉలిక్కిపడేంత భీకరమైన దాడులు చేస్తూనే ఉంది. కానీ వాటి స్పందన నామమాత్రంగానే ఉంది తప్ప ఇరాక్, ఉత్తర కొరియా తదితర దేశాలపై ఆంక్షలు విదించినట్లుగా పాకిస్తాన్ పై ఆంక్షలు విదించడానికి అంగీకరించలేదు. భారత్ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తూ పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడులు చేసినా కూడా ప్రపంచదేశాల స్పందన మూస పద్దతిలో నామమాత్రంగానే ఉంది. నేటికీ అమెరికా నిద్రలో కలవరిస్తున్నట్లుగా పాకిస్తాన్ని హెచ్చరిస్తుంటుంది తప్ప దానిపై ఆంక్షలు విదించే ఆలోచన కూడా చేయదు. ప్రపంచ దేశాలు ఆవిధంగా వ్యవహరించడానికి చాలా బలమైన కారణమే ఉంది.
కల్లు త్రాగిన కోతి చేతిలో కొబ్బరికాయ ఉన్నట్లుగా పాకిస్తాన్ చేతిలో భయానకమైన అణుబాంబులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అవి దేశంలో తిష్ట వేసుకొని కూర్చొన్న ఉగ్రవాదుల చేతిలోనో లేదా వాటిని ఒక్కసారైనా భారత్ పై ప్రయోగించి తమ సత్తా చాటుకోవాలని తహతహలాడిపోతున్న పాక్ సైనికాధికారుల చేతిలోనో పడితే ఎవరూ ఊహించలేనంత భయానక విద్వంసం జరుగుతుంది. ఇరు దేశాలలో లక్షలు లేదా కోట్లాది ప్రజలు మరణించే ప్రమాదం ఉంది.
ఆ అణుబాంబులని వారందరి నుంచి దూరంగా ఉంచడానికే అగ్రరాజ్యాలు సైతం పాక్ ముందు దాసోహమనక తప్పడం లేదు. ఉగ్రవాదులు, యుద్ధోన్మాధులు చేతిలో కీలుబొమ్మగా మారిన పాక్ ప్రభుత్వానికి అండగా నిలబడవలసి వస్తోంది కూడా.
ఈ నేపధ్యంలో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా భారత్ అందించే ఆధారాలని చూసి ప్రపంచ దేశాలు దానిపై కటిన చర్యలు తీసుకొంటాయని ఆశించలేము. కనుక మోడీ ప్రభుత్వం ఇప్పుడు తీసుకొన్న నిర్ణయం ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు తాత్కాలిక ఉపాయంగా మాత్రమే పనికి వస్తుంది తప్ప దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉండబోదని ఖచ్చితంగా చెప్పవచ్చు. పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పగల శక్తి,సామర్ధ్యాలు భారత్ కి ఉన్నప్పటికీ కేవలం ఆ భయం చేతనే ఇటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చెప్పక తప్పదు. ఇంకా పచ్చిగా చెప్పుకొన్నట్లయితే అది పలాయనవాదమే. కానీ పాకిస్తాన్ని అగ్రరాజ్యాలే ఏమీ చేయలేకపోతున్నప్పుడు భారత్ మాత్రం ఏమి చేయగలదు? చేస్తే అందుకు భారత్ ప్రజలు అందరూ బారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.
పాక్ తో యుద్ధం జరిగితే ఆదేశం భారత్ కంటే పదిరెట్లు ఎక్కువగా నష్టపోవాదం ఖాయం. కానీ ఏడు దశాబ్దాలలో ఒక్క ఉగ్రవాదంలో తప్ప మరే రంగంలో ఏమాత్రం అభివృద్ధి సాధించని పాకిస్తాన్ కి ఆ యుద్ధం వలన ఎంత నష్టం జరిగినా పట్టించుకోకపోవచ్చు. కానీ ఏడు దశాబ్దాలలో నిర్విరామ శ్రమతో అగ్రరాజ్యాలతో సమానంగా ఎదిగే స్థాయికి చేరుకొంటున్న భారత్ ఆ నష్టాన్ని ఏమాత్రం భరించలేదు. ఇన్నేళ్ళ శ్రమంతా ఒక్క అణుయుద్ధంతో కాలి బూడిదైపోతుంది. అందుకే నిసిగ్గుగా పలాయనవాదాన్నే ఆశ్రయించక తప్పడం లేదు. అందుకు భారతీయులందరూ బాధపడాలో, లేక ప్రభుత్వ విజ్ఞతకి సంతోషపడాలో తెలియదు.