వైసీపీ దళిత కార్యకర్త సింగయ్యను అత్యంత దారుణంగా కారుతో తొక్కి చంపిన ఘటనలో పోలీసులు ఏ 1 గా జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డిని చేర్చారు. ఏ 2గా జగన్మోహన్ రెడ్డి, ఏ3 గా కారు యజమానిని చేర్చారు. కారును జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వైసీపీ పేరిట కొనుగోలు చేశారు. జగన్ డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జగన్మోహన్ రెడ్డి. బెంగళూరులో ఉన్నారు.
మానత్వానికే మచ్చగా మారిన సింగయ్యను చంపిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా ఉంది. వాహనం వేగంగా పోవడం లేదు. అనుమతి లేని ర్యాలీని నిర్వహిస్తూ.. రోడ్ మీద షో చేస్తూ.. పోలీసుల ఆంక్షలను పెడచెవిన పెట్టి చేసిన ర్యాలీలో ఈ ఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి కారు నుంచి అభివాదం చేస్తున్న సమయంలోనే ముందుకు పోనిచ్చి.. ఈ మరణానికి కారణం అయ్యారు.
ప్రమాదం జరిగిన తర్వాత బాధితుడ్ని రోడ్డు పక్కన పడేసిపోయి మరో నేరం చేశారు. ఆ వ్యక్తి జగన్ కారు కింద పడలేదని తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ వీడియోల్లో అన్నీ బయటకు వచ్చాయి. జగన్ రెడ్డి మానవత్వం లేని మనిషి అని మరోసారి నిర్ధారణ అయింది. సింగయ్య మృతి కేసు.. జగన్ కు చుట్టాలని చూస్తున్నారని అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి ఏ మాత్రం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. జరిగిన తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం.. సింగయ్య కుటుంబానికి పదిలక్షలు ఇస్తామని అంటున్నారు.
పోలీసులు ఇప్పటికే ఆ వృద్ధుడు జగన్ కారు కిందపడి చనిపోలేదని గతంలో చెప్పారు. తమ కారే తగిలిందని ఓ వ్యక్తి వచ్చి చెప్పడంతో అలా చెప్పారు. కానీ వీడియోలు వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది.