ఒకప్పుడు రాష్ట్రం విడిపోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాపాడగలరని వైకాపా నేతలు చెపుతుండేవారు. ఆయన కూడా ఆంధ్రా ప్రజలకి అదేవిధంగా భరోసా ఇచ్చేవారు. ఒకపక్క రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా పూర్తయిపోతున్నప్పుడు కూడా జగన్, వైకాపా నేతలు అదేమాట చెప్పేవారు. అదే సమయంలో ఎన్నికలు అవుతున్నందున, రాష్ట్ర ప్రజలు తమ పార్టీకే ఓటు వేసి గెలిపిస్తే కేంద్రం మెడలువంచి రాష్ట్రం విడిపోకుండా కాపాడుతామని పదేపదే చెప్పేవారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత అదెలాగ సాధ్యమో జగన్ కానీ వైకాపా నేతలు గానీ ప్రజలకి వివరించే శ్రమ తీసుకోలేదు. కారణం..ఒకసారి రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత మళ్ళీ రాష్ట్రాలని కలపడం ఎవరి వల్లా కాదని వారికీ తెలుసు కనుగనుకనే.
అసలు రాష్ట్ర విభజన అనివార్యం అని అందరి కంటే ముందే పసిగట్టిన పార్టీ వైకాపాయేనని చెప్పక తప్పదు. అందుకే రాత్రికి రాత్రి తెలంగాణా నుంచి మూట ముల్లె సర్దుకొని ఆంధ్రాకి వచ్చేసి హడావుడిగా సమైక్యాంధ్ర ఉద్యమాలు మొదలుపెట్టేసింది. అది కూడా రాష్ట్రం విడిపోకుండా అడ్డుకొనేందుకు కాక ఆంధ్రా ప్రజలలో చాలా బలంగా ఉన్న సెంటిమెంటుని సొమ్ము చేసుకొని, వారిని ఆకట్టుకొని ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రావాలనే తపనతోనే వైకాపా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిందనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే తెదేపా కూడా అదే పని చేసిందని చెప్పక తప్పదు.
ఆనాడు రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా వైకాపా ప్రజలని ఏవిధంగా మభ్యపెట్టాలని ప్రయత్నించిందో మళ్ళీ ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా విషయంలో అదేవిధంగా మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పింది. దేశంలో ఇకపై ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వబోమని, హోదా ఉన్న రాష్ట్రాలకి కూడా దానిని తొలగించి ప్రత్యేక ప్యాకేజి మాత్రమే ఇస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కనుక ప్రత్యేక హోదాకి బదులు కేంద్రప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వీకరించి అందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు కూడా చెప్పేశారు. అంటే ప్రత్యేక హోదా కధని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముగించేసినట్లే అర్ధం అవుతోంది.
‘జబ్ మియా బీబీ రాజీహోతో క్యా కారేగా ఖాజీ?’ అన్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజితో సెటిల్ చేసేసుకొన్న తరువాత దాని గురించి జగన్మోహన్ రెడ్డో మరొకరో ఎంత గొంతు చించుకొంటే మాత్రం ఏమి ప్రయోజనం? కానీ ప్రయోజనం లేదని కూడా చెప్పలేము. అంటే ప్రత్యేక హోదా వస్తుందని దానర్ధం కాదు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు భాజపాని, సాధించనందుకు తెదేపాని నిందిస్తూ, ప్రజలలో వాటి పట్ల వ్యతిరేకతని పెంచుతూ వాటిని రాజకీయంగా దెబ్బ తీయవచ్చు.
బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంకా యువభేరి అంటూ యువతని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు భావించవచ్చు. ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఏలూరులో శ్రీ కన్వెన్షన్ హాల్లో జగన్ యువభేరి నిర్వహించబోతున్నారు. ఆ పార్టీ నేత తలసిల రఘురాం ఈ విషయం నిన్న మీడియాకి తెలిపారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రత్యేక హోదా సాధించగలరని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కనుక జగన్ చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ బారీ సంఖ్యలో యువత, ప్రజలు తరలిరావాలని కోరారు. దేశంలో ఇక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించమని, ఆ హోదా కలిగి ఉన్న రాష్ట్రాలకి కూడా దానిని తొలగిస్తామని కేంద్రప్రభుత్వం చెపుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇకా ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పడం ప్రజలని మభ్యపెట్టడం కాదా? ఆయన మళ్ళీ ప్రజలని ఎందుకు మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు అంటే ఈసారి ఈ ప్రత్యేక సెంటిమెంటుని క్యాష్ చేసుకొని వచ్చే ఎన్నికలలో విజయం సాధించడానికేనని అంటే ఎవరైనా కాదనగలరా?