వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు తెదేపా కూడా ఊహించలేని గొప్పగొప్ప వ్యూహాలతో ముందుకు వస్తుంటారు కానీ వాటి కోసం అయన ఎంచుకొన్న సమయం, సందర్భం సరిగా లేకపోవడం చేతనో లేదా వాటిని సరిగ్గా అమలు చేయలేకనో ఎదురుదెబ్బలు తింటుంటారు. ఉదాహరణకి రాజధాని భూసేకరణ, తెలంగాణా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, ప్రత్యేక హోదా కోరుతూ ఆయన చేసిన దీక్షలు ఏవిధంగా ముగిసాయో గుర్తు చేసుకొంటే ఆ విషయం అర్ధం అవుతుంది. తాజాగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపిల చేత రాజీనామాలు చేయించాలనే సరికొత్త వ్యూహాన్ని తొందరపడి బయటపెట్టుకొని ఎదురుదెబ్బలు తింటున్నారు. ఆయన మొన్న ఎన్నారైలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టుకొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు వారి చేత రాజీనామాలు చేయించాలనుకోవడం లేదని సర్ది చెప్పుకొన్నారు. తగిన సమయం, సందర్భం చూసి ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తానని చెప్పారు.
వైకాపా ఎంపిల చేత రాజీనామాలు చేయించాలనే మాటని ఆయన యాదృచ్చికంగా చెప్పారనుకోలేము. అటువంటి ముఖ్యమైన నిర్ణయాన్ని ఎంపిలతో, పార్టీ నేతలతో చర్చించకుండా హటాత్తుగా ప్రకటించే అవకాశమే లేదు. ఒకవేళ ప్రకటించి ఉంటే అది ఆత్మహత్యాసదృశమైనదే. కనుక అది వ్యూహాత్మకమైన ప్రకటనగానే చూడవలసి ఉంటుంది. కానీ దానితో ఆయన ఆశించింది ఒకటైతే జరిగేది, జరుగుతున్నది మరొకటి కావడమే విశేషం.
ఆ విధంగా ప్రకటించి తెదేపాని హడలెత్తించాలని అనుకొంటే, తెదేపా అయన ప్రకటనని స్వాగతించింది. పైగా తక్షణం ఆయన తన ఎంపిల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకి వెళ్ళి తనకున్న ప్రజాధారణని రుజువు చేసుకోవాలని తెదేపా నెల్లూరు నగర అధ్యక్షుడు కోటం రెడ్డి జగన్ కి సవాలు విసిరారు. ఇది జగన్ ఊహించని ప్రతిక్రియేనని చెప్పవచ్చు. వైకాపా ఎంపిల చేత రాజీనామాలు చేయిస్తానని చెప్పగానే, తెదేపా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజిల గురించి ఏదేదో మాట్లాడేసి తన ఉచ్చులో చిక్కుకొంటుందని భావిస్తే, జగన్ ప్రతిపాదనని స్వాగతించి పెద్ద షాక్ ఇచ్చింది.
తెదేపాని కవ్విద్దామనుకొంటే అదే తిరిగి కవ్విస్తోంది. రాజీనామాలు చేసి చూపమని సవాలు విసురుతోంది. జగన్ ఇప్పుడు తన మాటకి కట్టుబడలేరు అలాగని వెనక్కి తగ్గలేరు. మాటకి కట్టుబడితే పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. కట్టుబడకపోతే తెదేపా నేతలు ఇదే విధంగా ఎద్దేవా చేస్తూనే ఉంటారు. సమయం కాని సమయంలో ఇటువంటి మాటలు మాట్లాడటం ఆనక ఎదురుదెబ్బలు తినడం కూడా జగన్ కి అలవాటుగా మారిపోయినట్లుంది.