భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరంలో అసలు గుట్టురట్టయింది. ఎక్కడెక్కడ చెరువులను కబ్జాలు చేసి భవంతులు కట్టారో వరద నీరే స్పష్టంగా చెప్పింది. అంతే కాదు, జి హెచ్ఎం సి లో అవినీతి ఏ స్థాయిలో ఉందో కూడా అందరికీ తెలిసింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఈ విషయాన్ని ప్రకటించారు.
నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందేనంటూ మొన్న శనివారం నాడు ఘంటాపథంగా చెప్పారు కేసీఆర్. అక్రమ కట్టడాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటే బల్దియాలో ఒక్కరూ మిగలరని కేసీఆర్ చెప్పారు. అంటే ఆ స్థాయిలో అవినీతి ఉందన్నమాట. మరి రెండేళ్ల మూడు నెలలుగా ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పలేదు.
ఇప్పుడు వరదలతో ఈ సమస్య రాకపోతే ఇకముందు కూడా బల్దియాలో అవినీతి అక్రమాలు కొనసాగేవే అని నమ్మడానికి పెద్దగా తెలివి తేటలు అవసరం లేదు. చిన్న లాజిక్ చాలు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉంటానని చెప్పింది. మరి ఇంత భారీ అవినీతిని ఎలా ఉపేక్షించారో ప్రజలకు జవాబు చెప్పాల్సిందే. కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన కొడుకే ఇప్పుడు మున్సిపల్ మంత్రి. మరి అవినీతి విషయంలో తండ్రీకొడుకులు ఉక్కు పాదం మోపకుండా ఉపేక్షించడం అంటే అక్రమార్కులకు భయం లేకుండా చేయడమే కదా.
ప్రతిదానికీ గత పాలకులనే తిట్టడం సరే. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? 2014 జూన్ 2నుంచి ఇప్పటి వరకూ అవినీతిపై అంకుశం ప్రయోగించడానికి సమయం దొరకలేదా అని ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పాల్సిందే. పైగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకాన్ని గొప్పగా ప్రకటించారు. సదరు అక్రమ నిర్మాణాల్లో చెరువుల్లో నిర్మించినవీ ఉంటాయనే చిన్న విషయం కూడా కేసీఆర్ కు తెలియదని అనుకోవాలా? రెగ్యులరైజేషన్ పేరుతో ఖజానాలోకి 157 కోట్ల రూపాయలు వచ్చి చేరాయని సర్కారు సంబరపడినప్పుడు ఈ స్పృహ ఏమైందో అర్థం కాదు.
స్వయంగా ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి పదే పదే ఆదేశించినా కనీస స్థాయిలో స్పందించని బల్దియా వారిపై చర్య తీసుకున్న దాఖలాలు లేవు. తాను గుంతలు పూడ్చాలని స్వయంగా కమిషనర్ కు చెప్పిన మార్గంలోనే కేటీఆర్ రెండుమూడు సార్లు వెళ్లినా మార్పు లేదు. ఇంతటి ఘనమైన బల్దియాలో అవినీతి, అసమర్థతపై కేసీఆర్, కేటీఆర్ లు అంతులేని ఔదార్యాన్ని ప్రదర్శించడానికి కారణం ఏమిటో వాళ్లే చెప్పాలి.