జోగి రమేశ్.. జగన్ కు అత్యంత సన్నిహిత నేత. ఆయన కోసం ఏమైనా చేస్తారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేయాన్నా చేస్తారు. ఎవరినైనా బూతులు తిట్టాలని ఆదేశిస్తే క్షణం ఆలోచించకుండా బూతులు అందుకుంటారు. అందుకే అప్పట్లో ఆయనకు జగన్ కేబినెట్ లో చోటు కల్పించారు. అలాంటి నేత సడెన్ గా జగన్ కు షాక్ ఇచ్చారు.
అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీ కొంపముచిందని స్పష్టం చేశారు జోగి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా వైసీపీ అధికారంలోకి వస్తే ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు…ఏపీ శాసనసభలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు వైసీపీకి నష్టం చేశాయన్నారు. ఈ విషయంపై తన భార్య నిలదీసింది అని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని అసెంబ్లీకి పంపిస్తే బూతులు మాట్లాడుతారా అంటూ మందలించింది అంటూ ఓ ఛానెల్ లో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.
అయితే, జోగి రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయనలో ఇంతలోనే ఎంత మార్పు అంటూ అందరు షాక్ అవుతున్నారు. తాము అధికారంలోకి వచ్చినా అమరావతినే ఏకైక రాజధానిగా ఉంటుందని జోగి రమేశ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేదంటే జోగి ద్వారా వైసీపీ విధానాన్ని జగన్ చెప్పించారా? అనేది చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల అమరావతిపై జగన్ మాట్లాడుతూ రాజధానిని అమరావతికి సమీపంలోని 500ఎకరాల్లో నిర్మించవచ్చు కదా అంటూ చెప్పారు. దీంతో జగన్ మూడు రాజధానులకు స్వస్తి పలికినట్లేననే వాదనలూ వినిపించాయి.
ఇంతలోనే జోగి రమేశ్..వైసీపీ అధికారంలోకి వచ్చినా ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పడంతో జగనే జోగితో ఈ కామెంట్స్ చేయించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక, కేసుల వర్రీతోనే జోగి రమేశ్ లో ఈ పశ్చాతాపం కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.