కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు భారీ ఎత్తున జరిగాయి. ఓటింగ్ శాతం గతం కంటే మెరుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, ప్రైవేటు సంస్థలు కూడా సెలవు ప్రకటించాయి. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ తరలి వస్తారని భావిస్తున్నారు. అయితే, వాతావరణ శాఖ నివేదిక ప్రకారం… శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు. సరే, ఇదంతా ఒకెత్తు అయితే… కర్ణాటకలోని తెలుగువారిలో అనూహ్యంగా చర్చ జరుగుతోందనీ, ఎవరికి ఓటెయ్యాలనే అంశంపై గడచిన 48 గంటల నుంచే రకరకాల మాధ్యమాల ద్వారా అభిప్రాయాల బట్వాడా జరుగుతున్నట్టు సమాచారం.
భాజపా అధ్యక్షుడు అమిత్ షాపై తిరుమలలో దాడి అనంతరం కన్నడనాట తెలుగువారిలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు, గత రాత్రి నుంచే ఏపీకి చెందిన మూడు ప్రముఖ రాజకీయ పార్టీలూ, కర్ణాటకలోని తెలుగువారికి టచ్ లోకి వెళ్తున్నట్టు చెబుతున్నారు. సాంకేతికంగా కర్ణాటకలో ప్రచారం ముగిసినా, దాదాపు 30 వేల వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుగువారిని రీచ్ అయ్యే ప్రయత్నం జరుగుతోందట. అయితే, ఈ గ్రూపుల ద్వారా వెళ్తున్న సమాచారం, వీడియోలు, అభిప్రాయాలు… పార్టీలపరంగా ఉండేట్టు లేకుండా జాగ్రత్తపడుతున్నారని తెలుస్తోంది. ఈ గ్రూపుల్లో తిరుగుతున్న అంశాలేంటంటే… ఏపీ ప్రత్యేక హోదాని ఎంత సీరియస్ గా తీసుకోవాలనేది ఒక రకమైన అభిప్రాయం ప్రచారంలో ఉంది. ఇంకొన్ని గ్రూపుల్లో, ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లాభం కలిగించే పనులు చెయ్యరాదంటూ ప్రచారం సాగుతోందట!
ఒకవేళ కర్ణాటకలో భాజపా ఓడిపోతే, ఆంధ్రాలో చంద్రబాబు లేవనెత్తిన ప్రత్యేక హోదా అంశాన్నికి మరింత బలం పెంచినట్టు అవుతుందనీ, ఇది పరోక్షంగా టీడీపీకి బలం చేకూర్చే అంశంగా మారిపోతుందనే అభిప్రాయం కూడా వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతోందట. ‘మన ప్రాంతానికి చెందినవారు, మన కులానికి చెందినవారు టీడీపీకి లాభించేలా, భాజపాకి వ్యతిరేకంగా ఓటెయ్యద్దనే’ తరహాలో ఫార్వార్డ్ మెసేజ్ లు కొన్ని తిరుగుతున్నాయట. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగువారిని ఉక్కిరిబిక్కిరే చేసే ప్రయత్నం ఆంధ్రా వేదికగానే, ఇక్కడి రాజకీయ పార్టీలే చేయిస్తున్నానే అభిప్రాయం తెరమీదికి వచ్చింది. మొత్తానికి, ప్రత్యేక హోదా విషయంలో ఏపీ రాజకీయ పార్టీల అనైక్యత మరోసారి ఇలా బయటపడుతోంది. టీడీపీ, వైకాపా, జనసేన.. అందరికీ ప్రత్యేక హోదా కావాలి! కానీ, కలిసి పోరాడి సాధించే ప్రయత్నం ఉండదు. ఎందుకంటే, ఎవరికివారు విడివిడిగా పోరాటం చేసి సాధించాలి కదా!