సుప్రీంకోర్టు ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరిస్తే ఏమవుతుంది? అంటే కోర్టుధిక్కార నేరం అవుతుందని చెప్పడం తేలికే. కానీ అందుకు సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిని శిక్షించగలదా?అంటే మరికొన్ని రోజులు ఆగితేకానీ తెలియదు. ఇంతకీ ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అయ్యిందంటే, కావేరీ జలాల పంపకాలపై కర్నాటక, తమిళనాడు మధ్య జరుగుతున్న జల వివాదాలపై దాఖలైన ఒక పిటిషన్ పై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలని, అమలుచేయకూడదని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం భావించడమే.
ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ యు.యు.లలిత్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం, “మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రాలు అన్నీ సుప్రీంకోర్టు తీర్పుకి కట్టుబడి ఉండాలి. దానిని ఉల్లంఘిస్తామంటే కుదరదు. అది కర్నాటక-తమిళనాడు రాష్ట్రాలు కావచ్చు లేదా మరొక రాష్ట్రం కావచ్చు. మన ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే సహకార ధోరణిలోనే వ్యవహరించాలి మా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాము.. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో గొడవలు పెట్టుకొంటాము…సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించము..అంటే కుదరదు. కనుక కర్నాటక అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పక్కనపెట్టి బుదవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు రోజుకి 6,000 క్యూసెక్కుల చొప్పున తమిళనాడు రాష్ట్రానికి కావేరీ జలాలు విడుదల చేయవలసిందే. మళ్ళీ మేము మరోమారు చెపుతున్నాము. మా ఆదేశాలని కర్నాటక ప్రభుత్వం తప్పనిసరిగా అమలుచేసి తమిళనాడుకి నీళ్ళు విడుదల చేయాలని ఆదేశిస్తున్నాము. ఇప్పుడు నీళ్ళు విడుదల చేసి, అవసరమైతే మున్ముందు ఆ నీళ్ళని సర్దుబాటు చేసుకోవచ్చు,” అని సుప్రీంకోర్టు కర్నాటక ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది.
కానీ ఇదివరకు సుప్రీంకోర్టు ఆదేశాలు మన్నించి తమిళనాడు రాష్ట్రానికి కావేరీ జలాలు విడుదల చేసినందుకు రెండు రాష్ట్రాలలో చాలా బారీ విద్వంసం జరిగింది. కనుక కేవలం తమిళనాడు త్రాగినీటి అవసరాలకి సరిపడేంత నీళ్ళు మాత్రమే విడుదల చేయాలని ఈ మధ్యనే కర్నాటక శాసనసభ ఒక తీర్మానం ఆమోదించింది. కానీ దానిని పక్కనబెట్టి తాను ఆదేశించినట్లుగా తమిళనాడుకి నీళ్ళు విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్నాటక ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది.
దీనితో కర్నాటక ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశించినట్లు నీళ్ళు విడుదల చేసినట్లయితే రాష్ట్రంలో మళ్ళీ అల్లర్లు, విద్వంసం చెలరేగే ప్రమాదం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలని అమలుచేయకపోతే అది కోర్టు ధిక్కారం అవుతుంది. కనుక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య శాసనసభ, మండలిలో ప్రతిపక్ష నేతలని, ఎంపిలతో సమావేశం నిర్వహించారు. వారిలో చాలా మంది శాసనసభ తీర్మానానికే కట్టుబడి ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా వారితో ఏకీభవించారు. కానీ భాజపా, జెడియులు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలకి కట్టుబడి నీళ్ళు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఒకవేళ తన ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరిస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏవిధంగా స్పందిస్తుంది?వేచి చూడాల్సిందే.