తాను కొడితే మామూలుగా కొట్టనన్నారు..ఇక కాస్కో అంటూ హెచ్చరికలు జారీ చేశారు..వస్తున్నానని క్యాడర్ ను ఆశల పల్లకిలో ఊరేగించారు. జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు మొదట ప్రిపేర్ అయ్యారు. కట్ చేస్తే క్యాడర్ నిరాశను మిగిల్చారు. వస్తానని చెప్పిన కేసీఆర్ తాత్కాలికంగా ఆగిపోవడానికి రీజన్ ఏంటి? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ ఆగం అవుతోంది..ఇక తాను బయల్దేరుతా.. ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడుతా అంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రకటించారు కేసీఆర్. ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తుండగా కేసీఆర్ ప్రకటన బీఆర్ఎస్ క్యాడర్ కు ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. అందరూ జూన్ రెండో తేదీన బీఆర్ఎస్ దళపతి వస్తారని అనుకున్నారు. దాదాపు కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. ఆ రోజునే తన జిల్లాల టూర్ వివరాలను వెల్లడిస్తారని బీఆర్ఎస్ నేతలూ భావించారు. కానీ, కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి కదలలేదు. కనీసం తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించేందుకు అయినా బయటకు వస్తారని అనుకుంటే అలాంటిదేం జరగలేదు.
అయితే, కేసీఆర్ బయటకు రాకపోవడానికి కవితే కారణంగా బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పడున్న పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు వస్తే మీడియా తప్పనిసరిగా కవిత ఇష్యూపై ప్రశ్నిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సి వస్తోంది. వాటిపై కేసీఆర్ ఎలా మాట్లాడినా కూతురికి కౌంటర్ ఇచ్చినట్లు అవుతోంది. ఆమె మనసు నొప్పించేలా కేసీఆర్ ఇప్పటివరకు వ్యవహరించలేదు. కవిత అంటే కేసీఆర్ కు అమితమైన ప్రేమ. అందుకే ఇప్పటికిప్పుడు కవిత ఇష్యూపై మౌనంగానే ఉండాలని భావించే తెలంగాణ ప్రజలకు తన దర్శనభాగ్యాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.