భారీ వర్షాలు, వరదలకు జలమయమైన హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చడానికి ఓ ప్రణాళిక ప్రకారం పనిచేస్తామంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నగరంలోని నాలాల కబ్జాలకు పెద్ద సమస్య అని ఆయన చెప్పారు. 28 వేల అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ప్రకటించారు. ఈ అక్రమ కట్టడాలు కట్టిన వారిలో పేదలుంటే డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామనేది కేసీఆర్ ప్రకటన.
నగరంలోని నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలున్నాయని లెక్కచెప్పారు. వీటిని తొలగించడం ఖాయమని మీడియాకు స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల సమాచారం ఇచ్చిన వారికి 10 వేల రూపాయల నజరానా ఇస్తామని కూడా ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాదులో రోడ్ల పనులు, భవన నిర్మాణ అనుమతుల విషయంలో అవకతవకలపైనా కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉంది. జిహెచ్ ఎంసి లో అనుమతుల అక్రమాలపై చర్య తీసుకుంటే ఒక్కరు కూడా మిగలరనే ఆయన మాట నిజమే కావచ్చు. ఆ స్థాయిలో అవినీతి జరిగిందన్న మాట.
నగరంలో రోడ్ కాంట్రాక్టర్ వ్యవస్థ ఓ సిండికేట్ గా మారింది. దశాబ్దాలుగా అదే కాంట్రాక్టర్లు ఇష్టారీతిన రోడ్డు వేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. వారికి బాధ్యత లేకుండా పోవడం వల్ల నగరంలో రహదారులు అధ్వానంగా మారాయన్నారు. రోడ్డు వేసిన తర్వాత 3 లేదా 4 సంవత్సరాలు మెయింటెనెన్స్ బాధ్యత కూడా వారికే అప్పగించేలా మార్పులు చేస్తామన్నారు. జీహెచ్ ఎంసీలో ప్రక్షాళన చేయాల్సింది చాలా ఉందంటున్నారు కేసీఆర్.
విశ్వనగరంగా మార్చడానికి జీహెచ్ ఎంసీకి సుమారు 20 వేల కోట్ల రూపాయల రుణం ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా కావాల్సిన పనులు చేయిస్తారు. అయితే ఆ రుణం తిరిగి చెల్లించడంలో కార్పొరేషన్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందా అనేది కూడా ఆలోచించాలి. అవసరమైతే ఆ విషయంలో ప్రభుత్వం సహాయం చేయాలి. తక్షణం రోడ్ల మరమ్మతుల కోసం కార్పొరేషన్ కు 400 కోట్ల రూపాయలు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. నిధులు ఇవ్వడంతోపాటు నాణ్యంగా పనులు జరిగేలా చూడటం కూడా ముఖ్యం. ఈ విషయంలో చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం తప్పనిసరి. 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తామనికేసీఆర్ చెప్తున్నారు. అది పక్కాగా చేతల్లో కనిపిస్తేనే సార్థకత.