ముందస్తు ఎన్నికలు తేవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సెంటిమెంట్ గా హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన… కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఉన్న అన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సేనని ప్రకటించారు. రాజకీయ లబ్ది కోసం అవాకులు, చేవాకులలతో పిచ్చిపిచ్చి కారు కూతులు కూస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్రాపాలకుల దగ్గర అడుక్కోవడం తప్ప… ఎప్పుడూ క్రియాశీలకంగా పనిచేయలేదని కేసీఆర్ తేల్చేశారు. కిరణ్కుమార్రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని తెగేసి చెబితే…ఒక్క కాంగ్రెస్ నేత కూడా పోరాడలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని కేసీఆర్ స్వయం సర్టిఫికెట్ ప్రకటించేసుకున్నారు.
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్న తెలంగాణ సీఎం సమైక్యరాష్ట్రంలో జీవన విధ్వంసం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆదాయాన్ని సమకూర్చామని.. దాన్ని ప్రజా సంక్షేమం, సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చుచేశామన్నారు. రైతుల కోసం 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. అలా ఇస్తే… గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తానని జానారెడ్డి అన్నారని.. ఇప్పుడు జానారెడ్డికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ఆ పనిచేయాలని కేసీఆఆర్ సవాల్ చేశారు. తెలంగాణ నేతలు ఢిల్లీకి వెళ్లడాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. వారు ఢిల్లీ బాస్లకు గులామ్లన్నారు. కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇక్కడ కాదు… ఢిల్లీలో వస్తాయని హేళన చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అన్న…కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పుడు గోడలు గీకుతున్నారని ప్రశ్నించారు. సభ రద్దు చేస్తే ఢిల్లీకి ఉరుకుతున్నారు సెటైర్ వేశారు.కేవలం తెలంగాణ అభివృద్ధి కోసమే ముందస్తు ఎన్నికలని కేసీఆర్ ప్రజలకు చెప్పారు. అభివృద్ధి పనులు కొనసాగాలన్నదే ఉద్దేశన్నారు. ఐదేళ్ల వరకు మళ్లీ బ్రాహ్మాండంగా పనిచేయాలని…టీఆర్ఎస్ అధికారాన్ని త్యాగం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే… కరెంట్ కష్టాలు మళ్లీ మొదలవుతాయని కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే ఊరికో పేకాట క్లబ్ , గుడుంబా బట్టీలు మళ్లీ పుట్టుకొస్తాయన్నారు.టీఆర్ఎస్ పాలనలో బూటకపు ఎన్కౌంటర్లు లేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు. హుస్నాబాద్ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఓటమి లేదని..అందుకే అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించానని చెప్పుకున్న కేసీఆర్ బంగారు తెలంగాణ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవడం కన్నా.. కాంగ్రెస్ పార్టీ వస్తే.. ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేటీ టు పీజీ విద్య గురించి ఏమీ మాట్లాడకుండా… తాము ఇచ్చినహామీలన్నింటినీ అమలు చేశామని..వాటిని అందుకుంటున్న ప్రజలకు తెలుసన్నట్లుగా చెబుతున్నారు. .