తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు బనకచర్ల అనే నీళ్ల టాపిక్ ను నిప్పుగా మార్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎగువ రాష్ట్రం అయిన తెలంగాణ గోదావరిపై లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టుకుంది. అక్కడ్నుంచి దిగువకు వచ్చి.. సముద్రంలోకి పోయే నీటిని తాము బనకచర్లకు మళ్లించుకుంటామని ఏపీ ప్రయత్నాలు చేస్తూంటే రాజకీయం ప్రారంభించారు. ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామనుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ట్రాప్ లో మళ్లీ పడిపోతోంది. వారికి ఎలా కౌంటర్ ఇవ్వాలో అర్థం కాక గందరగోళ పడుతోంది.
కేసీఆర్ నాడు చెప్పిన ప్రకారమే బనకచర్ల
కేసీఆర్ రాయలసీమను గోదావరి జలాలలో సస్యశ్యామలం చేస్తామని రోజా ఇంట్లో విందు భేటీ తర్వాత చెప్పారు. అప్పట్లో అసెంబ్లీలో జగన్ రెడ్డి కూడా కేసీఆర్ గోదావరి జలాలను తీసుకెళ్లేందుకు సహకరిస్తున్నారని చెప్పారు. గోదావరి జలాల వేల టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని .. వాటిని ఉపయోగించుకోవాలంటే నదుల అనుసంధానం తప్పదన్నారు. నాడు కేసీఆర్ ఆలోచనల మేరకే.. నేడు బనకచర్ల నిర్మాణం జరుగుతోంది. అయితే ఇప్పుడు అదే బీఆర్ఎస్ రచ్చ చేస్తోంది. తెలంగాణకు ఏదో నష్టం జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ట్రాప్లో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ట్రాప్ లో పడిన సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు నష్టం లేని విధంగా గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తామని నేరుగానే చెప్పిన కేసీఆర్ మాటలు కళ్ల ఎదురుగా ఉండగా.. వారు చేస్తున్న రాజకీయానికి కౌంటర్ ఇవ్వలేక కాంగ్రెస్ వారి ట్రాప్ లో పడింది. బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలా నష్టమో చెప్పడానికి వారి వద్ద సమాధానం లేదు. కానీ తెలంగాణ నీళ్లు ఏపీ తీసుకుంటోందని రెచ్చగొట్టాడనికి మాత్రం..రెడీ అయ్యారు. వారి బాటలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది.
రాజకీయాల కోసం విద్వేషాలు పెంచడం ప్రమాదకరం
బీఆర్ఎస్ రాజకీయాలన్నీ ఇలా పక్కనోళ్ల మీద విద్వేషం పెంచి తాము లబ్ది పొందడం మీదనే ఉంటాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అంటూ తిట్టి, దోచుకున్నారని ఆరోపించి పెచుకున్నారు. చివరికి తెలంగాణ వచ్చిన పదేళ్లలో ఏం చేశారో అందరూ చూశారు. కేసీఆరే స్వయంగా గోదావరి నీళ్లు సీమకు పారిస్తామని చెప్పి.. ఇప్పుడు మళ్లీ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు. బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని.. ప్రజలకు చెప్పాల్సిన పార్టీలు రెచ్చగొట్టే రాజకీయాలు చేసి ప్రజల మధ్య చిచ్చు పెడితే జరిగేది నష్టమే.