కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులోనూ రేవంత్ రెడ్డి తన పట్టు నిరూపించుకున్నారు. శాఖల ప్రక్షాళన చేసి తమకు హోం, మున్సిపల్ వంటి శాఖలు అప్పగించాలని గట్టిగా ప్రయత్నించిన సీనియర్లకు జెల్లకొట్టడమే కాకుండా.. కొత్త మంత్రులకు కూడా.. వాటిని కేటాయించలేదు. తన వద్ద ఉన్న పదకొండు శాఖల్లో హోం, మున్సిపల్, ఎడ్యుకేషన్ కాకుండా మిగతా శాఖలను కొత్త మంత్రులకు కేటాయించారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కలిశారు. శాఖల కేటాయింపుపై కసరత్తు చేశారు. సీఎం సూచనల మేరకు గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, న్యాయ, క్రీడల శాఖ, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కమర్షియల్ టాక్స్ శాఖలు, అడ్లూరి లక్షణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సీఎస్కు రేవంత్ సూచించారు. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
హోం శాఖ కోసం ఇద్దరు సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే రేవంత్ మాత్రం ప్రభుత్వంలో మరో పవర్ సెంటర్ రాకూడదన్న లక్ష్యంతో ఆ శాఖల్ని ఇతరులకు కేటాయించలేదు. ఎడ్యుకేషన్, హోం, మున్సిపల్ వంటి కీలకమైన శాఖలకు ప్రత్య్యేకంగా మంత్రి లేకపోవడం వల్ల పాలనపై ప్రభావం పడుతోందని వస్తున్న విమర్శలను రేవంత్ పట్టించుకోలేదు. ఆ శాఖలను కూడా తానే చూసుకోవాలని డిసైడయ్యారు. హైకమాండ్ కూడా రేవంత్ అభిప్రాయానికే విలువ ఇచ్చింది.